ఫోన్ ఫ్రీజ్ అయిందా? జాగ్రత్త.. మీ UPI ఖాతాను ఖాళీ చేసే కొత్త సైబర్ మోసం!

తెలియని లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఫోన్‌ అకస్మాత్తుగా ఫ్రీజ్‌ అయితే జాగ్రత్తగా ఉండాలి. సైబర్‌ నేరగాళ్లు నకిలీ ఎర్రర్‌ మెసేజ్‌లు, కస్టమర్‌ కేర్‌ కాల్స్‌, హానికరమైన APKలతో యూజర్లను మోసం చేస్తున్నారు. యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్‌ అనుమతుల ద్వారా OTPలు, బ్యాంకింగ్‌ వివరాలను దొంగిలించే అవకాశం ఉంది.

ఫోన్ ఫ్రీజ్ అయిందా? జాగ్రత్త.. మీ UPI ఖాతాను ఖాళీ చేసే కొత్త సైబర్ మోసం!
Phone Freezes After Clicking A Link

Updated on: Sep 07, 2026 | 10:26 AM

సోషల్ మీడియాలో కనిపించే ప్రకటన లేదా పరిచయం లేని లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయితే దాన్ని సాధారణ సాంకేతిక సమస్యగా భావించొద్దని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ స్క్రీన్‌ స్తంభించడాన్ని దృష్టి మళ్లించే ఎత్తుగడగా ఉపయోగించి, బాధితుల బ్యాంకింగ్‌ వివరాలు, OTPలు, UPI ఖాతాలను టార్గెట్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫోన్‌ ఫ్రీజ్‌.. ఆ తర్వాత అసలు మోసం

క్విక్ హీల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ హరీష్‌ కుమార్‌ ప్రకారం.. ఫోన్‌లో కనిపించే నకిలీ ఎర్రర్‌ మెసేజ్‌లు లేదా ప్రకటనలతో వినియోగదారులను భయపెడతారు. అనంతరం కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులుగా ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేయాలని సూచిస్తారు. రివార్డ్‌, క్యాష్‌బ్యాక్‌, వెరిఫికేషన్‌ పేర్లతో APK ఫైళ్లను ఇన్‌స్టాల్‌ చేయించే అవకాశం కూడా ఉంటుంది.

OTP రీడింగ్ పర్మిషన్

హానికరమైన యాప్‌ ఫోన్‌లోకి వచ్చిన తర్వాత యాక్సెసిబిలిటీ, నోటిఫికేషన్‌, SMS వంటి అనుమతులను కోరవచ్చు. వాటిని ఇస్తే OTPలను చదవడం, స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని పర్యవేక్షించడం, కొన్ని సందర్భాల్లో వినియోగదారు చర్యలను అనుకరించడం వంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు.

UPIని నేరుగా హ్యాక్‌ చేయాల్సిన అవసరం లేదు

ఫ్యూచరెక్స్‌ సౌత్‌ ఏషియా వైస్‌ ప్రెసిడెంట్‌ రుచిన్‌ కుమార్‌ ప్రకారం.. మోసగాళ్లు UPI వ్యవస్థను నేరుగా ఛేదించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఫిషింగ్‌ పేజీలు, నకిలీ యాప్‌లు, స్క్రీన్‌ షేరింగ్‌, రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా బ్యాంకింగ్‌ ఆధారాలు లేదా ప్రమాణీకరణ వివరాలను పొందేందుకు ప్రయత్నిస్తారు. చివరకు బాధితుడే తన UPI PIN నమోదు చేసేలా లేదా లావాదేవీని ఆమోదించేలా మానసికంగా ఒత్తిడి చేయవచ్చు.

ఫోన్‌ ఫ్రీజ్‌ అయితే ఏం చేయాలి?

అనుమానాస్పద లింక్‌ తర్వాత ఫోన్‌ స్తంభిస్తే వెంటనే మొబైల్‌ డేటా, Wi-Fiని నిలిపివేయాలి. బ్యాంకింగ్‌ వివరాలు, UPI PIN, OTPలను నమోదు చేయకూడదు. అపరిచితుల సూచనలతో రిమోట్‌ యాక్సెస్‌, స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయకూడదు. అనుమానాస్పద యాప్‌లను తొలగించి, వాటికి ఇచ్చిన అనవసర అనుమతులను రద్దు చేయాలి. బ్యాంకింగ్‌ సమాచారం బహిర్గతమైందని అనుమానం ఉంటే వెంటనే బ్యాంకును సంప్రదించి, సురక్షితమైన పరికరం నుంచి సంబంధిత పాస్‌వర్డ్‌లు, PINలు మార్చుకోవాలి. ఆర్థిక మోసం జరిగితే వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌‌కు ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా, నిజమైన బ్యాంకు లేదా సేవా సంస్థ సాధారణ సమస్య పరిష్కారం కోసం రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయమని లేదా స్క్రీన్‌ షేర్‌ చేయమని అడగదని గుర్తుంచుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us