
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి. యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోగానే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కేవైసీ వివరాలు ముందుగా అప్డేట్ చేసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ను పీఎఫ్ పోర్టల్తో లింక్ చేసుకోవాలి. అలాగే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు లాంటి వివరాలన్నీ సరిచూసుకోవాలి. తప్పుగా ఉంటే వాటిని వెంటనే మార్చుకునే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మీ వివరాలు కేవైసీ డాక్యుమెంట్లలో ఒకలా.. మీ పీఎఫ్ పోర్టల్లో ఒకలా ఉంటే పీఎఫ్ క్లెయిమ్ విషయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. దీంతో వివరాలు ఒకేలా ఉండాలి.
అలాగే ఈ-నామినేషన్ అనేది తప్పనిసరిగా దాఖలు చేయాలి. మీ తల్లిదండ్రులు, భార్య లేదా భర్త వివరాలు సమర్పించాలి. వారి ఆధార్ కార్డు నెంబర్లతో పాటు ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా మీరు నామినీ వివరాలను అందించాలి. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే మీ పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ను నామినీ విత్ డ్రా చేసుకోవచ్చు. క్లెయిమ్ దాఖలు చేసి నామినీ నిధిని పొందవచ్చు. అలాగే మీరు సర్వీసులో ఉండగా మరణిస్తే ఈపీఎఫ్ఓ నుంచి కుటుంబానికి లేదా నామినీకి రూ.7 లక్షల వరకు జీవిత బీమా సొమ్ము అందుతాయి. ఇది పొందాలన్నా మీరు నామినీ వివరాలను పొందుపర్చాల్సి ఉండాలి. మీరు ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే కుటుంబసభ్యులు డబ్బులు పొందేందుకు ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలాగే పేపర్ వర్క్ కూడా చాలా ఉంటుంది. మీరు నామినీలను పొందుపర్చడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మీరు ఈ-నామినేషన్ దాఖలు చేసేందుకు గంటల కొద్ది సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఈ పని పూర్తవుతుంది. ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్లి ఈ -నామినేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి పేర్లు, ఆధార్ వివరాలు నమోదు చేయాలి. వారి పాస్ పోర్ట్ సైజు ఫొటోలను అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ చేస్తే నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మీరు కూడబెట్టుకున్న సొమ్ముకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలి. దీని వల్ల మీ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉంటుంది. మీ కుటుంబసభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. మీరు చేసే ఒక్క పని వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుంది.