
Petrol, Diesel Prices: పశ్చిమ ఆసియాలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు సంక్షోభానికి దారితీశాయి. దీని ప్రభావం ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్పై తీవ్రంగా పడింది. తాజాగా పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పాకిస్థాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ కొత్త ధరలను ప్రకటించారు.
ఈ కొత్త ధరలు శుక్రవారం నుండే అమలులోకి వచ్చాయి. రవాణా రంగంపై ఆధారపడి జీవించే సామాన్యులకు, కార్మికులకు ఈ ధరల పెరుగుదల గొడ్డలిపెట్టులా మారింది.
ఇది కూడా చదవండి: Air Cooler: ఏసీని సైతం తలదన్నే ఎయిర్ కూలర్.. అతి తక్కువ ధరల్లోనే ఏసీ లాంటి కూలింగ్!
అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ యంత్రాంగం ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) గుండా సరఫరా నిలిచిపోవడంతో మార్కెట్లో చమురు కొరత ఏర్పడింది. పాకిస్థాన్ తన చమురు అవసరాల కోసం సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై భారీగా ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా ఆ భారం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.129 బిలియన్లను సబ్సిడీల కోసం ఖర్చు చేసింది. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని తరుణంలో ఈ భారీ సబ్సిడీలను ఇకపై కొనసాగించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Summer Business Ideas: సమ్మర్లో సూపర్ బిజినెస్.. ఈ చిన్న చిట్కాలతో డబ్బే.. డబ్బు..!
పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి పాక్ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి 4 రోజుల పనిదినాలను అమలు చేస్తోంది. అలాగే పాఠశాలలకు సెలవులను పొడిగించడంతో పాటు, కొన్ని తరగతులను ఆన్లైన్ మోడ్లోకి మార్చింది.
పాకిస్థాన్లోని 24 కోట్ల జనాభాలో సుమారు 25 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం (Inflation), ఇప్పుడు పెరిగిన ఇంధన ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడి బతుకు మరింత భారంగా మారనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి