
కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను నిర్వహిస్తోంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మీ స్కీముల్లో వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాల్లో చాలామంది తమ డబ్బులు పొదుపు చేసుకుంటారు. వీటిల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్స్ ఏంటంటే.. పబ్లిక్ ప్రావిడెంట్(PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS). వీటిల్లో ఏందులో పెట్టుబడి పెడితే మంచిదనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) ఒక పదవీ విరమణ పింఛన్ పథకం. మీరు ఇప్పుడు డబ్బులు పెట్టుబడి పెడితే పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందుతారు. పదవీ విరమణ తర్వాత ఆర్ధిక భద్రత, స్ధిరమైన నిధి కోరుకునునేవారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. పదవీ విరమణ తర్వాత అధిక రాబడి కావాలనుకునేవారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పొదుపు చేసే డబ్బులు చక్రవడ్డీ ప్రభావంతో మరింతగా పెరుగుతాయి. కేవలం పదవీ విరమణ తర్వాత మాత్రమే వీటిని మీరు తీసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన 10 సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వల్ల మాత్రమే పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఎన్పీఎస్లో ట్యాక్స్ మినహాయింపులు చాలానే ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద అదనంగా మరో రూ.50 వేలు పన్ను మినహాయింపు ఉంటుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్లు వచ్చాక పెన్షన్ నిధిలో 60 శాతం ఒకేసారి తీసుకోవచ్చు.
ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా పాపులర్ అయిన పథకం. ఈ స్కీమ్లో కూడా చక్రవడ్డీ ద్వారా పెట్టుబడిపై హామీతో కూడిన రాబడి పొందవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం 7.1 శాతం ఉంది. రిస్క్ లేని పెట్టుబడి కోరుకునేవారికి ఇది మంచి పథకం. అయితే దీనికి 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీంతో మధ్యలో తీసుకోవడానికి కదరదు. కానీ రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలంలో అధిక రాబడి, రిస్క్ లేని సొమ్ము కావాలనుకునేవారికి ఇది మంచి పథకం. అలాగే మీరు దీని ద్వారా సంపాదించిన వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. ఏడాదికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు ఎంత అయినా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత రుణం తీసుకోవచ్చు. ఇక ఐదేళ్ల తర్వాత పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.