
దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందనే వార్తల మధ్య కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ సరఫరా పూర్తిగా అందుబాటులో ఉందని, కొరత గురించి వస్తున్న వార్తలు వాస్తవం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొంతకాలం వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ఇప్పుడు పరిస్థితి స్థిరపడిందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 10 శాతం పెంచాయి. నిల్వలు చేయడం లేదా దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు అదనపు పరిపాలనా చర్యలు కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్పీజీ పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు అధికారులు పర్యవేక్షణ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. దీని ద్వారా సరఫరా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
నిల్వలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద నిబంధనలను అమలు చేసింది. అయితే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ను అమలు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలోని అన్ని చమురు రిఫైనరీలు 100 శాతం కెపాసిటీతో పనిచేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా జియోపాలిటికల్ టెన్షన్స్, సప్లై చైన్ సమస్యలు ఉన్నప్పటికీ ఇంధన సరఫరాలను నిర్వహించడంలో భారత్ అనేక దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని అధికారులు చెప్పారు. సరఫరా అంతరాయం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అలాంటి వార్తలు అనవసరమైన భయాందోళనలను కలిగిస్తాయని హెచ్చరించింది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా కొనసాగడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై కొన్ని ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోందని చెప్పారు. దేశంలో ఎలాంటి కొరత లేదు. అవసరాలను తీర్చడానికి తగినంత ఇంధన సరఫరాలు, వ్యవస్థలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి