Narayana Murthy: మంచి వ్యక్తిగా కాకుండా.. అలా ఉండేందుకే నేను ఇష్టపడుతాను.. అందుకే ఢిల్లీ రావాలంటే ఇబ్బందిగా ఉందన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

|

Feb 22, 2023 | 12:23 PM

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దేశ రాజధాని ఢిల్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. కాబట్టి ఇక్కడికి రావడం అసౌకర్యంగా ఉందని నారాయణమూర్తి దేశ రాజధాని ఢిల్లీ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Narayana Murthy: మంచి వ్యక్తిగా కాకుండా.. అలా ఉండేందుకే నేను ఇష్టపడుతాను.. అందుకే ఢిల్లీ రావాలంటే ఇబ్బందిగా ఉందన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
Narayana Murthy
Follow us on

భారతదేశంలో వాస్తవంగా అవినీతి, మురికి రోడ్లు, కాలుష్యమేనని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి గతంలో అన్నారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ గురించి కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ట్రాఫిక్ ఉల్లంఘనల ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఢిల్లీలోని పరిస్థితిని వివవరించారు. తాను ఢిల్లీకి రావడం అసౌకర్యంగా భావిస్తున్నానని అన్నారు. క్రమశిక్షణా రాహిత్యం ఎక్కువగా ఉండే నగరం ఢిల్లీ కావడం విచారంగా ఉందన్నారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) వ్యవస్థాపక దినోత్సవంలో మూర్తి మాట్లాడుతూ, ఢిల్లీలో ఎవరూ ట్రాఫిక్‌ నిబంధనలు సరిగా పాటించరని.. అందుకే ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు. నిన్న తాను విమానాశ్రయంలో దిగి కారులో హోటల్‌కు వెళ్తున్నా సమయంలో మధ్యలో ఎన్నో రెడ్‌ సిగ్నల్స్‌ పడ్డాయి. కానీ, ఎవరూ వాహనాలు ఆపడం లేదన్నారు.

అలాగే ముందుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో కారు, బైక్, స్కూటర్ డ్రైవర్లు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సిగ్నల్ జంప్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకట్రెండు నిమిషాలు కూడా ఆగకపోతే ఎలా..?అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కనీసం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డబ్బులు వేస్తే అప్పుడైనా ఆగుతారేమోనని వ్యాఖ్యానించారు.

సమాజంలో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని.. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో పయనించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడే పిల్లలు అనవసరమైన ఉద్రిక్తతలకు లోనుకాకుండా ఉంటారని అన్నారు. కార్పొరేట్‌ పాలన గురించి పాఠశాల వయస్సులోనే తాను నేర్చుకున్నట్లుగా గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజా ఆస్తులను వ్యక్తిగత ఆస్తులకంటే బాధ్యతగా చూసుకోవాలని అన్నారు. ఈ నియమాన్ని నిజాయితీగా పాటించక పోయినందువల్లే.. ప్రభుత్వ ఆస్తులపట్ల ప్రజలకు చిన్నచూపు ఉందన్నారు. రోడ్డుపై ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

మా ఉపాధ్యాయుల నుంచి కార్పొరేట్ పాలన గురించిన మొదటి పాఠాన్ని నేర్చుకున్నామన్నారు. కమ్యూనిటీ ఆస్తి మీ వ్యక్తిగత ఆస్తి కంటే మెరుగ్గా పరిగణించబడాలి. ప్రజలు సూత్రాలను పాటించకపోవడం వల్లనే ప్రభుత్వ పాలనా వ్యవస్థలో నిజాయితీ లేని కేసులు జరుగుతున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. మంచి వ్యక్తిగా కాకుండా.. నిజాయితీపరుడిగా ఉండేందుకే తాను ఇష్టపడుతానని అన్నారు.

“మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. ఒక వేళ మీరు మంచి వ్యక్తి అయితే.. ఎవరైనా మీ వస్తువును దొంగలించినా.. మీరు నవ్వుతూ ఉంటారు. కానీ, నేను అందుకు ఇష్టపడను. అందుకే నేను నిజాయితీపరుడిగా పేరు పొందాలనుకుంటున్నాను. ఎవరైనా తప్పు చేస్తే ఎదిరించి చెప్పగలగాలి. మన దగ్గర సరైన విషయం ఉంటే అవతలి వాళ్లు ఓడిపోయినా, మనల్ని గౌరవిస్తారు. మనం చేసే పని నిక్కచ్చిగా ఉంటే.. వాళ్లు కూడా మద్దతిస్తారు’’ అని నారాయణమూర్తి వ్యక్తిత్వంపై మాట్లాడారు.

టెక్నాలజీ భవిష్యత్తు గురించి నారాయణమూర్తి మాట్లాడుతూ, సైన్స్ ప్రకృతిని వెల్లడిస్తుందని అన్నారు. అయితే మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి, సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికత సైన్స్ శక్తిని ఉపయోగిస్తుందని ఆయన అన్నారు.

చాట్‌జీపీటీ వంటి సాంకేతిక సాధనాలతో భవిష్యత్‌లో మరిన్ని మార్పులు రాబోతున్నాయని నారాయణమూర్తి అన్నారు. కృత్రిమ మేధస్సు సహాయక సాంకేతికతలుగా మారడం ద్వారా మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చింది. కృత్రిమ మేధస్సు మానవులను భర్తీ చేస్తుందనే తప్పుడు నమ్మకం ఉందని నేను భావిస్తున్నాను. కృత్రిమ మేధస్సును భర్తీ చేయడానికి మానవులు అనుమతించరని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం