Lalithaa Jewellery IPO: ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?

Lalithaa Jewellery IPO:దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆభరణాల రిటైలర్‌ దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ తన రూ.1,700 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాథమిక వాటా ఆఫర్ 2026 ఆగస్టు 17న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుంది..

Lalithaa Jewellery IPO: ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO.. ఒక్కో షేర్ ధర ఎంతంటే?
Lalithaa Jewellery

Updated on: Aug 12, 2026 | 7:25 PM

Lalithaa Jewellery IPO: దక్షిణాదిలో ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ అయిన ‘లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్’ (Lalithaa Jewellery Mart Limited) తన తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు సిద్ధమైంది. ఈ ఐపీఓ కోసం కంపెనీ ప్రైస్ బాండ్‌ను రూ. 5 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ.190 నుండి రూ.201 గా నిర్ణయించినట్లు వెల్లడించింది.

IPO ధరల శ్రేణి ఎంత?

లలితా జ్యువెలరీ IPOలో ఒక్కో ఈక్విటీ షేర్ ముఖ విలువ రూ.5 కాగా.. ధరల శ్రేణిని రూ.190 నుంచి రూ.201గా కంపెనీ నిర్ణయించింది. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్లకు బిడ్ వేయాలి. ఆ తర్వాత 74 షేర్ల చొప్పున బిడ్లు వేయాల్సి ఉంటుంది. అంటే ప్రైస్ బ్యాండ్‌లో కనీస ధర రూ.190 చొప్పున 74 షేర్లకు బిడ్ వేస్తే రూ.14,060, గరిష్ఠ ధర రూ.201 చొప్పున అయితే రూ.14,874 పెట్టుబడి అవసరం అవుతుంది.

ఈ ఐపీఓ కీలక తేదీలు, బిడ్డింగ్ వివరాలు:

  • ఐపీఓ ప్రారంభ తేదీ: 2026, ఆగస్టు 17
  • ఐపీఓ ముగింపు తేదీ: 2026, ఆగస్టు 19
  • ప్రైస్ బ్యాండ్: రూ.190 – రూ.201
  • ఫేస్ వ్యాల్యూ: రూ.5
  • మినిమమ్ బిడ్ లాట్: 74 షేర్లు
  • ఫ్రెష్ ఇష్యూ: రూ.1,200 కోట్ల వరకు
  • ఆఫర్ ఫర్ సేల్: రూ.500 కోట్ల వరకు
  • OFSలో షేర్లు విక్రయించేది: కంపెనీ ప్రమోటర్ ఎం. కిరణ్ కుమార్ జైన్

కంపెనీ ప్రస్తుతం 49,99,77,156 ఈక్విటీ షేర్లను కలిగి ఉంది. మొత్తం రూ. 1,700 కోట్ల ఐపీఓలో రూ. 1,200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉండగా.. కంపెనీ ప్రమోటర్ ఎం. కిరణ్ కుమార్ జైన్ ద్వారా రూ. 500 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంది. ఆఫర్ సమయానికి కంపెనీ వద్ద మొత్తం 49,99,77,156 ఈక్విటీ షేర్లు చెలామణిలో ఉన్నాయి. కంపెనీకి చెందిన ఆర్‌హెచ్‌పి (RHP) పత్రాలు ఇప్పటికే చెన్నైలోని ఆర్‌ఓసీ (RoC) వద్ద ఆగస్టు 9, 2026న దాఖలయ్యాయి.

లలితా జ్యువెలరీ బ్రాండ్ కింద కంపెనీ బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తోంది. దక్షిణ భారత మార్కెట్‌లోని ప్రాంతీయ అభిరుచులకు అనుగుణంగా వివిధ డిజైన్లలో ఆభరణాలను అందిస్తోంది. 2026 మార్చి 31 నాటికి కంపెనీకి 51 నగరాల్లో మొత్తం 61 స్టోర్లు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ స్టోర్లు విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం ఆపరేషనల్ ఏరియా సుమారు 6,50,881 చదరపు అడుగులు.

చిన్న నగరాలపై ప్రత్యేక దృష్టి

కంపెనీ వ్యూహంలో Tier-II, Tier-III నగరాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. FY2026లో మొత్తం 61 స్టోర్లలో 45 స్టోర్లు Tier-II, Tier-III నగరాల్లోనే ఉన్నాయి. ఈ స్టోర్ల ద్వారా కంపెనీ ఆదాయంలో సుమారు 60.25 శాతం వచ్చింది. అలాగే 61 స్టోర్లలో 51 స్టోర్లు 5,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో 39 స్టోర్లు Tier-II, Tier-III నగరాల్లో ఉన్నాయి.

ఈ సందర్భంగా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో లలితా జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. కిరణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే ప్రధాన మెట్రో నగరాల్లో బలంగా స్థిరపడ్డామని, ఐపీఓ తర్వాత కూడా మా ప్రాధాన్యత టైర్-II, టైర్-III నగరాలపైనే ఉంటుందన్నారు. ఈ నగరాల్లో ఆభరణాలకు అత్యంత బలమైన డిమాండ్ ఉందని, ఐపీఓ ద్వారా సమీకరించే నిధులతో రిటైల్ రంగాన్ని మరింత విస్తరిస్తూ కొత్తగా 10 షోరూమ్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కిరణ్‌ కుమార్‌ వెల్లడించారు. మా ప్రస్తుత తయారీ యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తుండటంతో.. కొత్త తయారీ కేంద్రాలపై తక్షణమే భారీ ఎత్తున ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు.

క్రిసిల్ (CRISIL) నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యవస్థీకృత ఆభరణాల రష్యా సంస్థలలో ఒక్కో స్టోర్‌కు అత్యధికంగా రూ. 410.23 కోట్ల నిర్వహణ రాబడిని నమోదు చేసి లలితా జ్యువెలరీ రికార్డు సృష్టించింది. అలాగే 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788.05 కోట్లుగా ఉన్న కంపెనీ కార్యకలాపాల రాబడి 2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 25,023.93 కోట్లకు పెరగ్గా.. నికర లాభం రూ. 359.83 కోట్ల నుండి రూ. 1,009.82 కోట్లకు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us