వారెవ్వా.. అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!

కర్ణాటకకు చెందిన యువ వ్యవసాయ పట్టభద్రుడు గయానాలో 500 ఎకరాల కొబ్బరి తోటను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. భారతీయ వ్యవసాయ సాంకేతికతను విదేశీ నేలపై అమలు చేస్తూ వేలాది కొబ్బరి చెట్లను పెంచుతున్న అతని విజయగాథ ఇప్పుడు యువ రైతులకు, వ్యవసాయ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

వారెవ్వా.. అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
Guyana Coconut Farm Karnata

Updated on: Aug 06, 2026 | 8:29 PM

సొంత ఊరిని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశీ గడ్డపై వ్యవసాయంలో సత్తా చాటుతున్న ఓ భారతీయ యువకుడి కథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. కర్ణాటకలోని బెలగావి జిల్లా నిప్పానికి చెందిన అభిలాష్, దక్షిణ అమెరికా దేశమైన గయానాలో ఏకంగా 500 ఎకరాల కొబ్బరి తోటను విజయవంతంగా నిర్వహిస్తూ భారతీయ వ్యవసాయ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు.

పీయూసీ పూర్తి చేసిన తర్వాత ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (వ్యవసాయం) చదివిన అభిలాష్ తొలుత ఓ వ్యవసాయ గిడ్డంగి సంస్థలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో అతని కాలేజీ సీనియర్ ద్వారా మొజాంబిక్‌లో ఫార్మ్ మేనేజర్‌గా పనిచేసే అవకాశం రావడంతో అతని జీవితమే మారిపోయింది. మొజాంబిక్‌లో మొదట భాషే అతనికి పెద్ద సవాలుగా మారింది. అక్కడ ఎక్కువ మంది పోర్చుగీస్ మాట్లాడటంతో మొదటి కొన్ని నెలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తర్వాత అదే భాష నేర్చుకుని పనిలో రాణించాడు. అక్కడ వ్యవసాయం కంటే కార్మికుల నిర్వహణే పెద్ద సవాలుగా ఉండేదని అభిలాష్ చెబుతున్నాడు.

ఆ తర్వాత అతనికి గయానాలో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడ భాషా సమస్య లేకపోయినా, కార్మికుల కొరత తీవ్రంగా కనిపించింది. చివరకు భారతదేశం నుంచి సుమారు 20 మంది కార్మికులను తీసుకెళ్లి పనులు ప్రారంభించారు. అభిలాష్ గయానాకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన అడవిగా ఉండేది. కానీ సంవత్సరాల పాటు కష్టపడి ఆ భూమిని సస్యశ్యామలం చేశాడు. ప్రస్తుతం అక్కడ 29,000 పొట్టి కొబ్బరి చెట్లు పెరుగుతున్నాయి. వాటిలో 5,000కు పైగా చెట్లు ఇప్పటికే దిగుబడిని ఇస్తున్నాయి. ఒకప్పుడు అడవిగా ఉన్న ప్రాంతం ఇప్పుడు విశాలమైన కొబ్బరి తోటగా మారింది.

ఫొటో: కొబ్బరి తోటలో పనిచేసే కార్మికులతో అభిలాష్

గయానాలో ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అభిలాష్ మాత్రం భారతీయ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నాడు. ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న పద్ధతులు, భారతీయ శాస్త్రవేత్తల సిఫార్సులు, నీటిపారుదల, ఎరువుల నిర్వహణ, తెగుళ్ల నియంత్రణ వంటి అంశాల్లో భారతీయ సాంకేతికతనే అమలు చేస్తున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం గయానాలో వరి, చెరకు, కొబ్బరి వంటి వాణిజ్య పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. అక్కడ వ్యవసాయ పట్టభద్రులకు మంచి అవకాశాలు కూడా ఉన్నాయని అభిలాష్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో గయానాలో సొంత వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేసి, మరిన్ని ఆధునిక సాంకేతికతలను అమలు చేయాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు. అయితే ఎంత పెద్ద విజయం సాధించినా, స్వగ్రామం నిప్పాని, అక్కడ ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటారని అభిలాష్ భావోద్వేగంగా చెబుతున్నాడు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వదేశానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి గయానాకు వెళ్లిపోతున్నాడు. విదేశీ నేలపై భారతీయ వ్యవసాయ జ్ఞానంతో విజయాన్ని అందుకున్న అభిలాష్ కథ యువ వ్యవసాయ పట్టభద్రులకు స్ఫూర్తిదాయకంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us