
Handwritten Will: దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న లక్షలాది ఆస్తి తగాదాలకు ప్రధాన కారణం సరైన వీలునామా లేకపోవడమే. అసలు వీలునామాను సాదా కాగితంపై రాయవచ్చా? రిజిస్ట్రేషన్ అవసరమా? సాక్షుల సంతకం లేకపోతే ఏమవుతుంది? న్యాయ నిపుణుల విశ్లేషణ మీకోసం..
భారతీయ వారసత్వ చట్టం – 1925 ప్రకారం, వీలునామా రాయడానికి ప్రత్యేకమైన ఫార్మాట్ ఏదీ లేదు. అలాగే వీలునామాను ఖరీదైన స్టాంప్ పేపర్ల మీదనే రాయాలని నిబంధన లేదు. వీలునామాను రిజిస్టర్ చేయించడం ఐచ్ఛికం మాత్రమే. రిజిస్టర్ చేయకపోయినా, చట్టపరమైన నిబంధనలు పాటిస్తే అది పూర్తి చెల్లుబాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వీలునామా రాసిన వ్యక్తి ఉద్దేశం ఎంత స్పష్టంగా ఉన్నా, సెక్షన్ 63 ప్రకారం కొన్ని నిబంధనలు పాటించకపోతే అది చెత్తబుట్టలోకి వెళ్లాల్సిందేనంటున్నారు. అలాగే వీలునామా రాసిన వ్యక్తి (Testator) పత్రంపై సంతకం చేయాలి లేదా వేలిముద్ర వేయాలి. వీలునామా రాసేటప్పుడు కనీసం ఇద్దరు సాక్షులు స్వయంగా అక్కడ ఉండాలి. రాసిన వ్యక్తి సంతకం చేసిన తర్వాత, సాక్షులు కూడా ఆ పత్రంపై సంతకాలు చేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు ఆస్తి వివరాలు రాసి సంతకం చేసినా, సాక్షుల సంతకాలు లేకపోతే ఆ పత్రాన్ని చట్టం గుర్తించదు.
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, దానిని చట్టపరంగా ‘ఇంటెస్టేట్’ (Intestate) అంటారు. అప్పుడు ఆస్తి పంపిణీ ఇలా జరుగుతుంది. ఆ వ్యక్తికి వర్తించే వ్యక్తిగత మతపరమైన చట్టాల (హిందూ, ముస్లిం లేదా క్రైస్తవ వారసత్వ చట్టాలు) ప్రకారం పంపిణీ జరుగుతుంది. ఆస్తి స్వయంచాలకంగా చట్టబద్ధమైన వారసులకు సమానంగా లేదా చట్టం సూచించిన నిష్పత్తిలో చేరుతుంది. వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోయినా, భవిష్యత్తులో వారసుల మధ్య గొడవలు రాకుండా ఉండటానికి రిజిస్ట్రేషన్ చేయించడం లేదా వీడియో రికార్డింగ్ చేయడం మంచిది.
ఇది కూడా చదవండి: Gold Price Today: బాబోయ్ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి