
అమెరికా – ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన సముద్ర మార్గాలకు ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో నెలకొన్న అనిశ్చితి, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా, తీవ్రంగా ప్రభావం చూపనుంది.
ప్రపంచ సముద్రమార్గ చమురు వ్యాపారంలో దాదాపు 30 శాతం ఈ ఇరుకైన జలమార్గం గుండానే జరుగుతుంది. ప్రతిరోజూ 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే ప్రయాణిస్తుంది. ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్, తన అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. మన దేశానికి అవసరమైన ముడి చమురులో సగం వరకు ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తాయి. చమురు ధరల్లో ఒక్క డాలర్ పెరుగుదల, దేశ దిగుమతి బిల్లును దాదాపు 2 డాలర్లను బిలియన్లు పెంచుతుంది. ఒకవేళ ఆయిల్ ధరలు బ్యారెల్కు 130 డాలర్లకు చేరుకుంటే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది రవాణా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రూపాయి విలువ కూడా పడిపోయే ప్రమాదం ఉంది.
ఆసియా – యూరప్ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు షిప్పింగ్ ఖర్చులను పెంచుతున్నాయి. ఓడలు మార్గాలను మార్చుకోవాల్సి వస్తే సమయం, ఖర్చు రెండూ పెరుగుతాయి, ఇది ఎగుమతి, దిగుమతులపై భారం వేస్తుంది.
ఈ సంక్షోభం వల్ల ఆసియా, యూరప్ దేశాలు నష్టపోతుండగా ఇంధన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కలిగి చమురును ఎగుమతి చేసే అమెరికా ప్రయోజనం పొందవచ్చు. ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వెతుక్కోవడం, సరఫరా మార్గాలను మెరుగుపరుచుకోవడం అత్యంత అవసరంగా మారింది.