
భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నెట్వర్క్. ప్రతిరోజూ లక్షలాది మందిని రైల్వే తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. ధర తక్కువ, దేశంలో ఎక్కడికైన కనెక్టివిటీ ఉండడమే దీనికి ప్రధాని కారణం. అయితే రాత్రి పూట ప్రయాణించే వారి సౌకర్యార్థం, ప్రయాణంలో క్రమశిక్షణ కోసం భారత రైల్వే శాఖ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా, ప్రయాణం ప్రశాంతంగా సాగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు లేదా తోటి ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
రాత్రి 10 గంటల తర్వాత కోచ్లలో ప్రయాణికులు ఎవరూ పెద్దగా మాట్లాడకూడదు. మొబైల్లో గట్టిగా మాట్లాడటం నిషేధం. అత్యవసరమైతే చాలా తక్కువ స్వరంతో మాట్లాడాలి. ఫోన్లలో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వినడం లేదా సినిమాలు చూడటం నిషిద్ధం. ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడుకోవాలి.
రాత్రి 10 గంటల తర్వాత కోచ్లోని మెయిన్ లైట్లన్నీ ఆపివేయాలి. కేవలం నైట్ లాంప్స్ మాత్రమే వెలుగుతాయి. తోటి ప్రయాణికుల నిద్రకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ నియమాన్ని తెచ్చారు. ఒకవేళ ఎవరైనా లైట్లు ఆపకుండా ఇతరుల నిద్రకు భంగం కలిగిస్తే ఫిర్యాదు చేయవచ్చు.
సాధారణంగా లోయర్, మిడిల్ బెర్త్ ప్రయాణికుల మధ్య సీటు విషయంలో వాదనలు జరుగుతుంటాయి. కొత్త రూల్ ప్రకారం.. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే మిడిల్ బెర్త్ను నిద్రించడానికి ఉపయోగించాలి. ఈ సమయంలో లోయర్ బెర్త్ ప్రయాణికుడు అభ్యంతరం చెప్పకుండా మిడిల్ బెర్త్ ఓపెన్ చేయడానికి సహకరించాలి.
రాత్రి పూట ప్రయాణికుల నిద్రకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య TTEలు టికెట్లను తనిఖీ చేయకూడదు. రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కే ప్రయాణికులకు మాత్రం ఇది వర్తించదు. వారు తమ టికెట్లను తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి.
రైల్వేలో ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత కూడా. ఇతర ప్రయాణికులను గౌరవించడం, వారికి సహకరించడం ముఖ్యం. ఈ నిబంధనలను ఎవరైనా ప్రయాణికుడు ఉల్లంఘిస్తే, తోటి ప్రయాణికులు రైలులోని ఆన్-బోర్డ్ స్టాఫ్కి ఫిర్యాదు చేయవచ్చు. పదేపదే నిబంధనలు అతిక్రమించే వారిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.