Indian Railways: ఏఐ సాయంతో రైల్వేశాఖ సూపర్ ప్లాన్.. ప్రయాణికులకు కావాల్సింది ఇది కదా..

రైల్వేశాఖ ప్రయాణికులకు ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో భాగంగా కొత్త నిర్ణయానికి నాంది పలికింది. ఇందుకోసం ఏఐ సాయం తీసుకుంటోంది. కిచెన్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలు పనిచేస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

Indian Railways: ఏఐ సాయంతో రైల్వేశాఖ సూపర్ ప్లాన్.. ప్రయాణికులకు కావాల్సింది ఇది కదా..
Indian Railways

Updated on: Jun 04, 2026 | 7:59 PM

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైళ్లల్లో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భోజనాల తయారీలో పరిశుభ్రత, క్వాలిటీని మరింత మెరుగుపర్చేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. ఇందుకోసం రైళ్లల్లో ఆహారం సరఫరా చేసే 800కిపైగా బేస్ కిచెన్లలో ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలను ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 800 కిచెన్లలో 2,400 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐఆర్‌సీటీసీ చైర్మన్ ఎస్.కె జైన్ ప్రకటించారు.

ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు

ఐఆర్‌సీటీసీ ప్రధాన కార్యాలయంలో కిచెన్లలోని కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కిచెన్లలోని కార్యకలాపాలను ఏఐ సాయంతో పర్యవేక్షిస్తారు. ఈ కెమెరాలు 24 గంటల పాటు భోజనం తయారీ పనులను పర్యవేక్షిస్తాయి. పరిశుభ్రతతో పాటు ఆహారం తయారీ, నిర్వహణలోని లోపాలను సెకన్లలోనే గుర్తిస్తుంది. ఒక వెంట్రుక వంటి చిన్నపాటి లోపాలను కూడా గుర్తించే సామర్థ్యం ఈ ఏఐ కెమెరాలకు ఉంది. దీని వల్ల అధికారులు వెంటనే అలర్ట్ చేసి సిబ్బందికి సూచనలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందుతుంది. ఇటీవల వందే భారత్ లాంటి ప్రీమియం ట్రైన్లలో కూడా భోజన నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా రైల్వేశాఖ రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రీమియం రైళ్లల్లో టిక్కెట్లతో పాటు ఫుడ్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతిరోజూ 16.5 లక్షలకు పైగా భోజనాలను రైల్వేశాఖ వడ్డిస్తోంది. ఇప్పుడు ఈ భోజనాల తయారీని ఏఐ ఆధారిత అత్యాధునిక కెమెరాల సాయంతో నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

నాణ్యమైన భోజనం

రైళ్లల్లోని ఆహార నాణ్యతపై తరచూ  ప్రయాణికుల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. పాడైపోయిన, వాసన వచ్చే ఫుడ్ అందించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.  దీంతో రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాయం కూడా తీసుకుంటోంది.

 

 

Follow Us