ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతా ప్రతి ఉద్యోగికి ఉంటుంది. ఇది పదవీవిరమణ తర్వాత జీవితానికి ఉపయోగపడేలా రూపొందించిన స్కీమ్. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి నుంచి అలాగే తను పనిచేసే కంపెనీ నుంచి కొంత భాగం దానిలో జమవుతుంది. సాధారణంగా దీనిలో మొత్తాన్ని పదవీవిరమణ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వీలుంటుంది. వైద్య చికిత్స, వివాహాలు, విద్య, గృహ రుణాలు, గృహ నిర్మాణ ఖర్చులు వంటి నిర్దిష్ట ఆర్థిక అవసరాలకు దీని నుంచి నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వీలుంటుంది. అయితే ఎక్కువ శాతం మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన సమయంలోనే దీని నగదు విత్ డ్రా చేసేందుకు ఖాతాదారులు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అత్యవసర చికిత్సల వేళ పీఎఫ్ నుంచి నగదు ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు? తెలియాలంటే ఈ కథనం చదవండి..
వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రాణాంతక పరిస్థితుల కారణంగా ఆస్పత్రిలో చేరిన సందర్భంలో, ఈపీఎఫ్ఓ సభ్యులు రూ. 1 లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ అడ్వాన్స్ తీసుకోవాలంటే ఆస్పత్రి నుంచి ఎస్టిమేషన్ సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే రూ. లక్ష ఏక మొత్తంలో మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేస్తున్నారు. ఎందుకంటే ప్రాణాంతకమైన అనారోగ్యాల విషయంలో, రోగిని అతని/ఆమె ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రిలో చేర్చడం తప్పనిసరి అని, అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఆసుపత్రి నుంచి అంచనాను పొందడం సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఏక మొత్తంలో రూ. లక్ష విత్ డ్రా చేసే సమయంలో వ్యాధి చికిత్సకు సంబంధించి ఈఎస్ఐసీ లేదా సీజీహెచ్ఎస్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్ వంటి ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ విభాగంలో చేరిన వారు ఉపసంహరణలు చేయవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రి విషయంలో మాత్రం ఈపీఎఫ్ఓ ప్రాథమికంగా కొన్ని అంశాలు తనిఖీ చేసి అడ్వాన్స్ ఇవ్వవచ్చా లేదా అనేది నిర్ణయిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..