
అనురాధ భర్త కోటీశ్వర వ్యాపారవేత్త. నగరంలో అనేక ఆస్తులు, అద్దెకు ఇచ్చిన దుకాణాలు ఉండేవి. వడ్డీకి డబ్బులు ఇచ్చే వ్యాపారం కూడా చేసేవారు. కుటుంబంలో డబ్బుకు ఎలాంటి కొరత ఉండేది కాదు. అనురాధ విలాసవంతమైన జీవితం గడిపేవారు. ఒంటినిండా బంగారు నగలు ధరించేవారు. ఇంటి పనుల కోసం పనిమనుషులు ఉండేవారు. అవసరమైనప్పుడు ఖర్చు చేయడానికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. పర్సులో ఎప్పుడూ నగదు ఉండేది. అవసరమైన వారికి డబ్బులు ఇచ్చే స్థితిలో ఆమె ఉండేవారు. అందుకే ఇరుగుపొరుగు వారు, బంధువులు ఆమెను ఆప్యాయంగా సేఠానీ అని పిలిచేవారు.
ఒకరోజు అనురాధ భర్తకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆయన ఆకస్మికంగా మరణించారు. అంతే.. అప్పటివరకు తనకు అవసరం లేదనుకున్న ఆర్థిక అవగాహన ఎంత ముఖ్యమో అనురాధకు అర్థమైంది. భర్త ఎంతో సంపద కూడబెట్టారని ఆమెకు తెలుసు. కానీ ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి? బ్యాంకు ఖాతాలు ఏవి? ముఖ్యమైన పత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎలా పొందాలి? వంటి విషయాలపై ఆమెకు పూర్తి అవగాహన లేదు. భర్త బతికున్నంతకాలం ఈ విషయాలన్నీ పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఆయన లేని సమయంలో అవే అతిపెద్ద సమస్యగా మారాయి. భర్త మరణం తర్వాత అనురాధ కొడుకులు కొన్ని పత్రాలు తీసుకొచ్చి సంతకాలు చేయాల్సి ఉందని చెప్పారు. తండ్రి ఆస్తులకు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేయడానికి అవి అవసరమని చెప్పారు. అనురాధ కూడా తన భర్తను నమ్మినట్టే కొడుకులను నమ్మారు. పత్రాలపై సంతకాలు చేశారు. తర్వాత తన భర్త దశాబ్దాలుగా కూడబెట్టిన సంపదపై కొడుకులు నియంత్రణ సాధించినట్లు తనకు తెలిసింది. ఒకప్పుడు ఇతరులకు డబ్బులు ఇచ్చిన ఆమె.. ఇప్పుడు తన రోజువారీ ఖర్చుల కోసం పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.
పాత తరం కుటుంబాల్లో సాధారణంగా భర్త సంపాదించడం, పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం.. భార్య ఇంటిని, పిల్లలను చూసుకోవడం జరిగేది. అనురాధ కుటుంబంలోనూ ఇదే జరిగింది. ఆమె భర్త వ్యాపారం, పెట్టుబడులు, ఆస్తుల వ్యవహారాలను చూసుకునేవారు. భర్తపై పూర్తి నమ్మకం ఉండటంతో ఆర్థిక వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని ఆమె భావించారు. కానీ ఒక కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలన్నీ ఒక్క వ్యక్తికే పరిమితమైతే, ఆ వ్యక్తి లేని సమయంలో మరో వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాహంలో నమ్మకం చాలా ముఖ్యం. కానీ నమ్మకం అంటే ఆర్థిక విషయాల్లో పూర్తిగా ఆధారపడటం కాదు. కుటుంబానికి చెందిన ఆస్తులు ఏవి? బ్యాంకు ఖాతాలు ఎక్కడ ఉన్నాయి? పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి? బీమా పాలసీలు ఏవి? అప్పులు ఉన్నాయా? ఆస్తుల పత్రాలు ఎక్కడ ఉన్నాయి? వీలునామా ఉందా? వంటి ప్రాథమిక విషయాలు భార్యాభర్తలు ఇద్దరికీ తెలిసి ఉండాలి.
బాంబే లా ఛాంబర్స్కు చెందిన ప్రైవేట్ క్లయింట్ ప్రాక్టీస్ మేనేజింగ్ పార్ట్నర్, కో-హెడ్ కరణ్ కల్రా ప్రకారం.. ఆస్తులు, వాటికి సంబంధించిన సమాచారాన్ని జీవితంలో ఏ దశలోనైనా సక్రమంగా డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయనకు చెందిన ఆస్తులను గుర్తించడం కూడా కష్టమవుతుంది. ఆస్తుల పంపకం విషయంలో వీలునామా కీలక పాత్ర పోషిస్తుంది. వీలునామా లేకుండా ఎవరైనా మరణిస్తే, వర్తించే వ్యక్తిగత చట్టాల ప్రకారం ఆస్తులు వారసులకు చెందుతాయి. హిందూ వివాహిత పురుషుడు వీలునామా లేకుండా మరణించిన సందర్భంలో, అతని ఆస్తులపై భార్య, పిల్లలకు చట్టపరమైన హక్కులు ఏర్పడవచ్చు. అయితే చట్టపరంగా హక్కు ఉండటం, ఆస్తిని సులభంగా పొందడం రెండూ ఒకటే కాదు. బ్యాంకులు, డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక సంస్థలు వారసత్వ హక్కులను నిర్ధారించడానికి ప్రత్యేక ప్రక్రియలను పాటిస్తాయి. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేని జీవిత భాగస్వామికి, దుఃఖ సమయంలో ఈ పత్రాలు, ప్రక్రియలు మరింత భారంగా మారవచ్చు. నామినేషన్తో పాటు వీలునామా కూడా ఉండాలి. వీలునామా వృద్ధాప్యంలో మాత్రమే చేయాల్సిన పని కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్ ఆస్తుల పంపకంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక ఆస్తులకు నామినేషన్లు సక్రమంగా ఉండాలి. అవి వీలునామాతో అనుసంధానంగా ఉండేలా చూసుకోవాలి. అయితే పవర్ ఆఫ్ అటార్నీ వీలునామాకు ప్రత్యామ్నాయం కాదు. వ్యక్తి మరణించిన తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ చెల్లుబాటు కాదు.
MIDASX సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాష్ బన్సల్ సూచన ప్రకారం కుటుంబానికి సంబంధించిన అన్ని ఆర్థిక వివరాలను ఒకచోట నమోదు చేసుకోవడం మంచిది. అందులో బ్యాంకు ఖాతాల వివరాలు, పెట్టుబడులు, బీమా పాలసీలు, అప్పులు, ఆస్తుల పత్రాలు, పన్ను సంబంధిత పత్రాలు, నామినేషన్లు, వీలునామా వంటి వివరాలు ఉండాలి. ఈ పత్రాలు ఎక్కడ భద్రపరిచారో భార్యాభర్తలు ఇద్దరికీ తెలిసి ఉండాలి. అవసరమైనప్పుడు వాటిని ఎలా యాక్సెస్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఇందుకోసం సురక్షితమైన డిజిటల్ ఫోల్డర్ను కూడా ఉపయోగించవచ్చు. ఒక జీవిత భాగస్వామి మరణించిన తర్వాత ఆస్తులు బదిలీ అయ్యాయని లేదా తమకు పూర్తిగా అర్థం కాని పత్రాలపై సంతకాలు చేశామని తెలిసినప్పుడు తొందరపడి మరో నిర్ణయం తీసుకోకూడదు. ముందుగా ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీల వివరాలు, ఆస్తి పత్రాలు, సంతకాలు చేసిన పత్రాలు వంటి వాటిని సేకరించాలి. అవసరమైతే స్వతంత్ర న్యాయ, ఆర్థిక నిపుణుల సలహా తీసుకుని ఆస్తుల యాజమాన్యం, వారసత్వ హక్కులు, నామినేషన్లు, పత్రాల చెల్లుబాటు వంటి అంశాలను పరిశీలించాలి.
పిల్లల చదువు, ఇంటి రుణం, రిటైర్మెంట్, పెట్టుబడులు వంటి విషయాలపై భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. కానీ ‘మనలో ఒకరు లేకపోతే ఆస్తుల పరిస్థితి ఏమిటి?’ అనే ప్రశ్నను చాలామంది వాయిదా వేస్తారు. నిజానికి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ విషయంపై చర్చించాలి. బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, బీమా, ఆస్తులు, అప్పులు, నామినేషన్లు, వీలునామా.. ఇలా కుటుంబ ఆర్థిక పరిస్థితిని కలిసి సమీక్షించాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఆర్థిక నిపుణులు కావాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రాథమిక అవగాహన మాత్రం తప్పనిసరి. అనురాధ కథ కేవలం డబ్బు గురించి కాదు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన ఉంటే, ఆ వ్యక్తి లేని సమయంలో మరో వ్యక్తి ఎంతటి ఇబ్బందుల్లో పడవచ్చో చెప్పే ఉదాహరణ. భర్తను నమ్మడం అనురాధ చేసిన తప్పు కాదు. కానీ ఆ నమ్మకంతో పాటు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన లేకపోవడమే ఆమెకు సమస్యగా మారింది. కుటుంబంలో డబ్బు ఎక్కడ ఉంది? ఏ ఆస్తులు ఉన్నాయి? ఎలాంటి అప్పులు ఉన్నాయి? ముఖ్యమైన పత్రాలు ఎక్కడ ఉన్నాయి? నామినీలు ఎవరు? వీలునామా ఉందా? అనే విషయాలు భార్యాభర్తలు ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆర్థిక భద్రత అంటే కేవలం సంపదను కూడబెట్టడం కాదు. మనం లేని సమయంలో మన జీవిత భాగస్వామి ఆ సంపదను గుర్తించి, అందుకుని, కాపాడుకునేలా చేయడం కూడా అంతే ముఖ్యం. జీవిత భాగస్వామిపై నమ్మకం ఉండాలి.. కానీ ఆర్థిక విషయాల్లో అవగాహన కూడా ఉండాలి.