
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈ పరిణామాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లో మాత్రం మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ Oil and Natural Gas Corporation (ONGC)కు ఈ పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ముడి చమురు ధరలు పెరిగితే, చమురు తవ్వి విక్రయించే కంపెనీల ఆదాయం స్వయంగా పెరుగుతుంది. ONGC ప్రధాన వ్యాపారం ఇదే కావడంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల కంపెనీ లాభ మార్జిన్ను బలపరచే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాక్ పనితీరు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూపుతోంది. గత ఏడాదిలో ONGC షేర్లు సుమారు 23.91 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా దాదాపు 17.30 శాతం లాభం నమోదు చేశాయి. ప్రస్తుతం షేర్ ధర రూ.279 వద్ద ట్రేడవుతుండగా, ఇటీవల 52 వారాల గరిష్టమైన రూ.282.50ను తాకింది. చమురు ధరల తాజా ర్యాలీ కొనసాగితే, ఈ స్టాక్ మరింత పెరుగుదలకు అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే మార్కెట్లో ప్రతి లాభానికి మరో వైపు నష్టం కూడా ఉంటుంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి సంస్థలు ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేస్తాయి. ముడి చమురు ఖరీదవుతే, వీటి ఇన్పుట్ ఖర్చులు పెరిగి లాభాలు తగ్గే అవకాశం ఉంది. గల్ఫ్ సంక్షోభం భారత మార్కెట్కు మిశ్రమ ప్రభావాన్ని చూపుతోంది. చమురు ఉత్పత్తి కంపెనీలకు ఇది అవకాశంగా మారుతుండగా, శుద్ధి, మార్కెటింగ్ కంపెనీలకు మాత్రం ఇది సవాల్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి