Indian Railways: రైల్వేలో భారీ మార్పులు.. దేశంలో 5 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌

Indian Railways: ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులో వాపి–సూరత్‌ సెక్షన్‌ నిర్మాణాన్ని డిసెంబర్‌ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. అనంతరం పరీక్షలు, ఇతర అనుబంధ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారత్‌లోనే తయారవుతున్న హైస్పీడ్‌ రైలు తొలి కోచ్‌ సిద్ధమైందని..

Indian Railways: రైల్వేలో భారీ మార్పులు.. దేశంలో 5 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌
Indian Railways

Updated on: Sep 16, 2026 | 7:01 AM

Indian Railways: గుజరాత్‌లో రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఐదు గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ (GCT)కు సంబంధించిన పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. వీటి ద్వారా సరుకు రవాణా వేగం పెరగడంతో పాటు లాజిస్టిక్స్‌ ఖర్చులు, పోర్టుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది.

ఐదు టెర్మినల్స్‌లో కీలక కార్యక్రమాలు

గుజరాత్‌లోని కచ్‌, మోర్బీ, బనస్కాంత, మెహసానా ప్రాంతాల్లో ఈ గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. కచ్‌లోని శివలఖా GCTను రైల్వే మంత్రి ప్రారంభించారు. కచ్‌లోని భీమాసర్‌, మోర్బీలోని దేవలియా, బనస్కాంతలోని చందిసర్‌ GCTలను దేశానికి అంకితం చేశారు. మెహసానాలోని లించ్‌ GCTకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివలఖా GCT నుంచి మిథాపూర్‌కు ఉప్పుతో నిండిన సరుకు రైలును కూడా అశ్విని వైష్ణవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్‌లో ఉత్పత్తి అయ్యే ఉప్పును దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్ల ద్వారా మరింత సమర్థవంతంగా తరలించేందుకు ఇది ఉపయోగపడనుంది.

ఉప్పు రవాణాకు ప్రత్యేక కంటైనర్లు:

ఉప్పు రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తేలికపాటి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కంటైనర్లను రూపొందించినట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు.. సాధారణ రైల్వే వ్యాగన్లతో ఉప్పును తరలించేటప్పుడు వ్యాగన్‌ బరువు కారణంగా సరుకు సామర్థ్యం తగ్గడంతో పాటు.. ఉప్పు తేమను పీల్చుకోవడం వల్ల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయంలో సమస్యలు తలెత్తేవి. కొత్త కంటైనర్లలో పైభాగం నుంచి ఉప్పును లోడ్‌ చేసి, పక్కవైపు నుంచి అన్‌లోడ్‌ చేసుకునే విధంగా డిజైన్‌ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీంతో ఉప్పు రవాణా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

దేశవ్యాప్తంగా 150 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ ప్రారంభమయ్యాయని మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. వీటి ద్వారా పరిశ్రమలకు ప్రయోజనం కలగడంతో పాటు సరుకు రవాణా కోసం రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని చెప్పారు.

కచ్‌లో రూ.5,600 కోట్ల రైల్వే ప్రాజెక్టులు

కచ్‌ ప్రాంతంలో దాదాపు రూ.5,600 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. సమఖియాలి, భచావు, గాంధీధామ్‌, ఆదిపూర్‌, భుజ్‌ ప్రాంతాలను కలిపే మార్గాల్లో సామర్థ్య విస్తరణ, డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

 

ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులో వాపి–సూరత్‌ సెక్షన్‌ నిర్మాణాన్ని డిసెంబర్‌ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. అనంతరం పరీక్షలు, ఇతర అనుబంధ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారత్‌లోనే తయారవుతున్న హైస్పీడ్‌ రైలు తొలి కోచ్‌ సిద్ధమైందని, ప్రస్తుతం వివిధ పరీక్షలు జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దేశీయ హైస్పీడ్‌ రైల్వే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రైలును రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా, గుజరాత్‌లో కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్స్‌, సరుకు రవాణా కోసం ప్రత్యేక కంటైనర్లు, రైల్వే లైన్ల సామర్థ్య విస్తరణ వంటి చర్యలతో సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us