
మార్కెట్లో గోల్డ్ రన్ కొనసాగుతోంది. 15 రోజుల్లోనే ఏకంగా రూ.7,130కి పెరిగింది గోల్డ్ ధర. ఏప్రిల్ 7వ తేదీన 10 గ్రాములు బంగారం ధర రూ. 91,420గా ఉంటే.. శనివారం 10 గ్రాములు రూ.98,550కి చేరింది. అలాగే ఈ వారంలోనూ బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. 30న అక్షయ తృతీయకు లక్ష అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాదేస్తున్న ట్రంప్, మరోవైపు తమదేశంలోని సెంట్రల్బ్యాంక్ను కూడా టెన్షన్ పెడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ను ట్రంప్ భయం వీడట్లేదు. US ఫెడ్ చీఫ్ పావెల్ను తొలగిస్తానంటూ ట్రంప్ హెచ్చరికలు చేశాడు. దీంతో ఫెడ్ స్వతంత్రకు భంగం వాటిల్లవచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా.. ఆయన ప్రతిపాదనను US ఫెడ్ తోసిపుచ్చింది. ఇక ట్రంప్ తీరుతో గోల్డ్పై పెట్టుబడికే ఇన్వెస్టర్ల మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో మన దగ్గరా ధర అమాంతం పెరుగుతోంది. ప్రస్తుత బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం ధర రూ.98వేల 550గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్లో రూ.98వేల 400గా ఉంది.