
ఈ సహకారం వల్ల చిన్న రుణ సంస్థల రుణ మూల్యాంకనం, పర్యవేక్షణ సామర్థ్యాలు మెరుగుపడతాయి. డేటా ఆధారిత విశ్లేషణలు, అధునాతన సాధనాలు, ప్రత్యేక శిక్షణల ద్వారా చిన్న రుణ సంస్థలను బలోపేతం చేయనున్నారు. దీనివల్ల ఆర్థిక సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. బాధ్యతాయుతమైన రుణ పంపిణీకి ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ అవగాహన కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరేలా పలు భాషల్లో డిజిటల్ సమాచారం రూపొందించారు. కమ్యూనిటీ ఆధారిత విధానాన్ని అనుసరించి, చిన్న రుణ సంస్థలు తమ ఖాతాదారులకు రుణాలపై సరైన అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. తద్వారా, బాధ్యతాయుతమైన క్రెడిట్ అలవాట్లు పెంపొందుతాయి. ఆర్థిక సేవలు తగినంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సా-ధన్ సంస్థకు 230కి పైగా సూక్ష్మ రుణ సంస్థలు, బ్యాంకులు సభ్యులుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ట్రాన్స్యూనియన్ సిబిల్, సా-ధన్ కలిసి ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి వర్క్షాప్లు నిర్వహిస్తాయి. క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత, డేటా వినియోగం, పటిష్టమైన రుణ వ్యవస్థ నిర్మాణం వంటి అంశాలపై చిన్న రుణ సంస్థలకు, వారి బృందాలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా మాడ్యూల్స్ రూపొందిస్తాయి.
ట్రాన్స్యూనియన్ సిబిల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ భవేష్ జైన్ మాట్లాడుతూ.. “రుణాలపై అవగాహన కేవలం అప్పు తీసుకోవడానికి మాత్రమే కాదు. ఆర్థిక ప్రపంచంలో నమ్మకాన్ని, విశ్వసనీయతను పెంచుకోవడానికి ఇది కీలకం. డిసెంబర్ 2024 నాటికి 13 కోట్ల మంది తమ సిబిల్ రిపోర్ట్, స్కోర్ను పరిశీలించారు. ఇది క్రెడిట్ గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. ఈ భాగస్వామ్యం ద్వారా, చిన్న రుణ సంస్థలు, వారి ఖాతాదారులకు ఆర్థికంగా మరింత మెరుగైన భవిష్యత్తును అందించాలని మేము ఆశిస్తున్నాం” అని తెలిపారు.
సా-ధన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ జీజీ మామ్మెన్ మాట్లాడుతూ, “గ్రామ స్థాయి నుంచి క్రెడిట్ అవగాహన కల్పించడం నిజమైన ఆర్థిక సమ్మిళితత్వానికి దారి తీస్తుంది. రుణ పాత్రను, జీవనోపాధి అవకాశాలను పెంచడంలో దాని ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు, వారు వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో మరింత విశ్వాసంతో పాల్గొనగలరు. ఈ భాగస్వామ్యం ద్వారా కీలకమైన సమాచారం నేరుగా అవసరమైన వారికి చేరుతుందని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు.