EPFO New Rules: అమల్లోకి ఈపీఎఫ్‌ఓ కొత్తరూల్స్.. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రా కుదరదు!

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నేటి నుంచి ఈపీఎఫ్ విత్‌డ్రా పరిమితుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. గతంలో లాగా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకోవడం ఇకపై కుదరదు.

EPFO New Rules: అమల్లోకి ఈపీఎఫ్‌ఓ కొత్తరూల్స్.. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రా కుదరదు!
Epfo New Rules 2026

Updated on: Jul 02, 2026 | 9:25 AM

ఈపీఎఫ్‌ లబ్ధిదారులకు ఇదో బిగ్‌ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే నేటి నుంచి మీ పీఎఫ్‌కు సంబంధించిన నిబంధనలలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. తాజాగా ఈపీఎఫ్‌ పథకంలో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా పాత పథకాల్లో మార్పులు చేస్తూ ఈపీఎఫ్ 1952, 95, 76 స్థానాల్లో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

పీఎఫ్‌ విత్‌డ్రా పరిమితులు 

ఈ కొత్త పథకాల్లో పీఎఫ్‌ విత్‌డ్రా రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. గతంలో మాదిరి కాకుండా ఇకపై ఏడాదికి కేవలం 2 సార్లు మాత్రమే పీఎఫ్‌ విత్‌డ్రా చేసేలా రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది.

అనారోగ్యం, చదువు, ఇళ్ల కొనుగోలుకు కొత్త నిబంధనలు

అనారోగ్య కారణాలు: ఇంతకు ముందు అనారోగ్యం కారణంగా లిమిట్‌ లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది, కానీ ఇకపై అలా కుదరదు. మీరు ఏ కారణం చేతనైనా పీఎఫ్‌ అకౌంట్‌ నుండి డబ్బులు విత్‌డ్రా చేస్తే.. ఆ ఏడాదిలో అనారోగ్య సమస్య వస్తే, మళ్లీ ఒక్కసారి మాత్రమే డబ్బులు తీసుకునేందుకు వీలుంటుంది.

చదువు: ఎడ్యుకేషన్ పర్పస్‌లో అయితే మొత్తంగా 10 సార్లు తీసుకోవచ్చు.

ఇల్లు, స్థలం, రెంట్: అలాగే ఇల్లు, ప్లాట్ కొనడం లేదా హౌస్ రెంట్ కోసం గతంలో కేవలం రెండు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే ఛాయిస్ ఉండగా.. ఇకపై దాన్ని 5 సార్లకు పెంచింది.

అకౌంట్‌లో కనీస నిల్వ 

ఈ కొత్త పథకంలో మీరు కనీసం 25 శాతం పీఎఫ్ డబ్బులను కచ్చితంగా అకౌంట్లోనే ఉంచాల్సి ఉంటుంది. మీ పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడానికి వీలుండదు. మీరు పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకునే నాటికి మీ అకౌంట్‌లో ఉన్న ఉద్యోగి వాటా, యజమాని వాటా, ఆ మొత్తం డబ్బులకు వచ్చిన వడ్డీతో కలిపి ఈ 25 శాతాన్ని లెక్కిస్తారు. అలాగే, మీరు పీఎఫ్ అకౌంట్‌ ఓపెన్ చేసిన ఒక ఏడాది తర్వాత మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది.

కంపెనీలు/సంస్థలకు కొత్త రూల్స్

అలాగే సంస్థల విషయంలో కూడా కొన్ని మార్పులు చేసింది. ఇకపై 20 మందికి మించి ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు పీఎఫ్‌ను అందించాల్సి ఉంటుంది. కంపెనీ యజమానులు ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలో 12 శాతం వాటాను జమ చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి మినహాయించడం కుదరదు. ఒకవేళ అలా మినహాయించినట్లు తేలితే ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us