
మారుతి సుజుకి కార్లు కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఇప్పుడు కంపెనీ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ను త్వరలో నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వాహనాల ఉత్పత్తిని మార్చి 2025 నాటికి నిలిపివేయబడవచ్చని మీడియాలో కథనాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే.. ఈ కారు అమ్మకాల్ని ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేసేందుకు కంపెనీ నిర్ణయించింది. ఎన్నో అంచనాల మధ్య మార్కెట్లో విడుదలైన ఈ మారుతి సియాజ్ వేరియంట్ ను సంస్థ ఆకస్మికంగా ఎందుకు నిలిపివేయాలనుకుంటోంది? దాని వెనుక గల కారణాన్ని తెలుసుకుందాం…
2018 ఆర్థిక సంవత్సరంలో మిడ్-సైజ్ సెడాన్ అమ్మకాలు 1,73,374 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో క్రమంగా 97,466 యూనిట్లకు తగ్గింది. ఆటోకార్ నివేదిక ప్రకారం, గత ఏడాది అక్టోబర్లో 659 యూనిట్లు సియాజ్ అమ్ముడయ్యాయి, నవంబర్లో 597 యూనిట్లు మరియు డిసెంబర్లో 464 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ఈ కారు మొత్తం 5861 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ సంవత్సరం ప్రాతిపదికన ఈ కారు అమ్మకాలు 34 శాతం తగ్గాయి.
ఈ కారును చివరిసారిగా 2018 లో అప్గ్రేడ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు కారుకు ఎటువంటి అప్డేట్ రాలేదు. మరోవైపు, ఈ కారుతో పోటీపడే కార్లలో, కస్టమర్లు సన్రూఫ్,అడాస్, టర్బో పెట్రోల్ ఇంజిన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను పొందుతున్నారు. భారత మార్కెట్లో ఈ సెడాన్ ధర రూ. 9 లక్షల 41 వేల 500 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి 2020లో సియాజ్ డీజిల్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది. ఈ కారు డీజిల్ వేరియంట్ నిలిపివేయబడిన సమయంలో, సియాజ్ మొత్తం అమ్మకాలలో డీజిల్ వేరియంట్ వాటా 30 శాతంగా ఉంది. ఈ కారు డీజిల్ వేరియంట్ బీఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో డీజిల్ వేరియంట్ను నిలిపివేయాల్సి వచ్చింది.