
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం అనేది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు ఆదాయ మద్దతును అందించే రైతుల సంక్షేమ పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఒక్కో కుటుంబానికి రూ.6000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కల్పిస్తుంది. ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 16వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మొత్తం రూ. 6,000 వార్షిక మొత్తంలో ప్రధానమంత్రి ఈ విడత రూ. 2,000 చొప్పున 9 కోట్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రధాని మోదీ విడుదల చేసిన మొత్తం రూ. 21 వేల కోట్లకు పైగా ఉంది. పీఎం-కిసాన్లో 9,01,67,496 మంది రైతులు లబ్ధి పొందారు. అయితే పీఎం కిసాన్ 17వ విడత సొమ్ము త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. పీఎం కిసాన్ 17వ విడత నిధులు పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ తదుపరి నిధులను ఎలా పొందాలో? ఓసారి తెలుసుకుందాం.
పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం పీఎం కిసాన్ నమోదు చేసుకున్న అర్హులైన రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ -ఆధారిత ఈ-కేవైసీ అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం రైతులు సమీపంలోని సీఎస్సీ కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు.
పీఎం-కిసాన్ పథకం షెడ్యూల్ ప్రకారం వాయిదాలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. గత ఏడాది నవంబర్లో విడుదల కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 16వ విడత విడుదలైంది. కాబట్టి పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత జూన్ 2024లో విడుదల అవుతుంది. అయితే లోక్ సభ ఎన్నికల కారణంగా ఇది ఆలస్యమయ్యే అకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..