సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనె ధరలు.. భారీగా పెరుగుతున్న ఆయిల్‌ ధరలు.. పెరుగుదలకు కారణాలేంటి..?

ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డి వరుస్తుంటే.. మరోవైపు వంట నూనెల ధరలు కూడా భారీగా పెరుగుతూ సామాన్యులకు గండంగా మారుతోంది. వంట నూనె ధర..

సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనె ధరలు.. భారీగా పెరుగుతున్న ఆయిల్‌ ధరలు.. పెరుగుదలకు కారణాలేంటి..?

Updated on: May 31, 2021 | 11:44 AM

ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డి వరుస్తుంటే.. మరోవైపు వంట నూనెల ధరలు కూడా భారీగా పెరుగుతూ సామాన్యులకు గండంగా మారుతోంది. వంట నూనె ధర ఈ నెలలో భారీగా పెరిగింది. పామ్ ఆయిల్, వేరు శనగ నూనె, ఆవాల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ఇలా మీరు ఏ నూనె తీసుకున్నా కూడా ధరలు మండిపోతున్నాయి. వంటల్లో నూనె వేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే.. వంట నూనె ధర దశాబ్ద కాలంలోనే గరిష్ట స్థాయికి చేరింది. 2010 జనవరి నుంచి నూనె ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అయితే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ గత సోమవారం రాష్ట్రాలతో, వ్యాపారులతో సమావేశం నిర్వహించింది. ధరలు తగ్గించాలని కోరింది. ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ ఫెడరేషన్ కూడా ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై సీరియస్‌గా ఉంది. ధరల పెరుగుదలను గమనిస్తే.. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర ఏడాదిలోనే కేజీకి రూ.110 నుంచి రూ.175కు పెరిగింది. సోయాబిన్ ఆయిల్ ధర రూ.100 నుంచి రూ.155కు పెరుగగా, ఆవాల నూనె రూ.115 నుంచి రూ.170కు ఎగబాకింది. ఇక పామ్ ఆయిల్ ధర రూ.150కు ఎగసింది. దీని ధర ఏడాది కిందట రూ.85 ఉంది. 2010 ఏప్రిల్‌లో అయితే ఈ రేటు రూ.49 మాత్రమే ఉండేది. ఇలా వంట నూనె ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూనె ప్యాకెట్‌ కొనాలంటేనే భయపడుతున్నారు. ఒకప్పుడు వందలోపు ఉన్న ధర.. ఇప్పుడు ఏకంగా రూ.200లకు చేరువలో ఉంది.

అంతేకాదు నిత్యావసర సరుకులు సైతం ధరలతో మండిపోతున్నాయి. ప్రతియేటా ముడి వంటనూనె దిగుమతుల కోసం కేంద్రం 76 వేల కోట్ల రూపాయలకుపైగా వెచ్చిస్తోంది. దేశంలో వరి, గోధుమ ఇతర ఆహార పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు ఉన్నట్లే నూనె గింజల పంటలకు లేవు. రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందకపోవడం కారణంగా అధిక శాతం రైలులు వీటిని సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

అసలు ఎందుకింత ధరలు పెరుగుతున్నాయ్‌..

దీనికి అధికంగా మనం దిగుమతులపై ఆధారపడడమే కారణం. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్‌, బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, రష్యా, అర్జెంటీనా నుంచి పొద్దుతిరుగుడు నూనెను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అలాగే వంట నూనెలపై దేశం దిగుమతి సుంకాలు అధికంగా ఉండడమూ ధరలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. మరో ఐదు శాతం వస్తుసేవల పన్ను జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉండటం వల్ల ధరలు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ ఆంక్షలతో దిగుమతులు ఆగిపోవడం కూడా ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో లభించే డేటా ప్రకారం.. ఆరు రకాల వంట నూనెల నెలవారీ సగటు, రిటైల్‌ ధరలు 2010 జనవరి నుంచి అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రాల పౌర సరఫరాల విభాగం సైతం అంగీకరిస్తున్నాయి. సాధారణ వంటనూనెల, ఆవలనూనె నెలవారీ సగటున చిల్లర ధర ఈ ఏడాది మే నెలలో రూ.164.44కు చేరుకుంది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 36 శాతం అధికం.

భారత్‌లో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నూనె గింజలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో సాగయ్యే ప్రధాన నూనె గింజలు వేరు శెనగ, పామాయిల్‌, నువ్వులు, సోయా, అముదాలు, పొద్దు తిరుగుడు, ఆవాలు. 2020 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల 30 లక్షలు మెట్రిక్‌ టన్నుల నూనెగింజల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది కోటీ 20 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉత్పత్తి చేసిన సోయాబిన్‌ అత్యధికంగా సాగు చేసిన పంటగా నిలిచింది. రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో వంటనూనెల వినియోగం పడిపోయింది. ఆయిల్ ప్యాకెట్ కార్టన్లు గతంలో రోజుకు 50 అమ్మితే, ఇప్పుడు 20 కూడా అమ్మలేకపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. వంట నూనెల ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుదల కంటే దేశీయంగా అధికంగా ఉంది. దేశీయ అవసరాల్లో 70 శాతం దిగుమతుల ద్వారానే భర్తీ అవుతోంది. అంతర్జాతీయ ధరలు దేశీయ ధరలకు కీలకం. దిగుమతి సుంకాలు తగ్గించి ధరలకు అడ్డుకట్ట వేయవచ్చు.

ఇవీ కూడా చదవండి:

New Rules : జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!

Samsung Refrigerators: ఆదిరిపోయే ఆఫర్‌.. నెలకు రూ.890 కడితే చాలు ఫ్రిజ్‌ సొంతం చేసుకోవచ్చు..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us