Ratan tata: సామాన్యుల కోసం రతన్ టాాటా ఇంత ఆలోచించారా..? నీరా రాడియా చెప్పిన విషయాలివే..!

సాధారణంగా పారిశ్రామిక వేత్తలందరూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక ప్రణాళికలు రూపొందిస్తారు. తమ పెట్టుబడికి పదింతలు లాభం రావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఉత్పత్తులను తయారు చేస్తారు. కానీ ఇలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా, ప్రజల సౌకర్యం కోసం ఆలోచించిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా. పేద ప్రజలందరికీ ఆయన సుపరిచితుడు. అందుకే ఆయన కన్నుమూసిన విషయం తెలిసి దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు కారును అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో నానోకు ప్రణాళిక రూపొందించారు.

Ratan tata: సామాన్యుల కోసం రతన్ టాాటా ఇంత ఆలోచించారా..? నీరా రాడియా చెప్పిన విషయాలివే..!
Ratan Tata Nano Car

Updated on: Oct 21, 2024 | 4:15 PM

అనేక కష్టనష్టాలకు ఓర్చి నానో కారును విడుదల చేశారు. రతన్ టాటా పడిన ఈ కష్టం వెనుక కారణమేమిటంటే సామాన్యులూ సౌకర్యంగా ప్రయాణం చేయడం. నీరా రాడియా 2000 నుంచి 2012 వరకూ టాటా గ్రూపులో పనిచేశారు. నానో కారు సమయంలో జరిగిన సంఘటనలను ఆమె తెలిపారు. రతన్ టాటా మదిలో నానా కారు రూపకల్పన వెనుక పెద్ద కారణముంది. ఆయన వ్యాపార వ్యవహారాలపై పర్యటనలు చేసే సమయంలో రోడ్డుపై మోటారు సైకిల్ మీద వెళుతున్న కుటుంబాలను చూసేవారు. ఒకే బండిపై తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు వెళ్లేవారు. చాలా ఇరుకుగా ఇబ్బంది పడుతూ ప్రయాణం చేసేవారు. అలాగే వర్షం పడుతుంటే తడుస్తూ ప్రమాదకరంగా వెళ్లవారు. వారిని చూసి రతన్ టాటా బాధపడేవారు. కారు కొనుగోలు చేయాలంటే సుమారు రూ.ఐదు లక్షలకు పైగా ఖర్చు చేయాలి. కానీ సామాన్యులకు అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి మోటారు సైకిల్ ధరలోనే ప్రయాణానికి సౌకర్యవంతమైన కారును తయారు చేయాలనే నిర్ణయించుకున్నారు. అలా నానో కారును రూ.లక్షకే అందజేశారు.

పశ్చిమ బెంగాల్ లోని సింగూర్ లో నానా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని రతన టాటా భావించారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. అప్పటి ప్రభుత్వం నానో కార్ల తయారీకి స్థలం కూడా కేటాయించింది. కానీ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. దీంతో కర్మాగారం గుజరాత్ కు తరలిపోయింది. సింగూర్ లో నానో ఫ్యాక్టరీ వెనుక రతన్ టాటా ప్రధాన ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని, ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయడమే. దాని కోసం ఆయన అక్కడ కర్మాగారం ఏర్పాటు చేయాలని భావించారు.

బెంగాల్ లో నానో ప్లాంట్ వివాదం జరుగుతున్న సమయంలోనే కోరస్ ఒప్పందం కోసం టాటా గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఒకే సారి రెండు పెద్ద అంశాలను ఆ కంపెనీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కోరస్ కోసం జరుగుతున్న బిడ్ లో అధికారులు పాల్గొన్నారు. అలాగే బెంగాల్ లో జరుగుతున్న ఉద్యమాన్ని గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు గుజరాత్ లో ఫ్యాక్టరీ మొదలై నానో కారు బయటకు వచ్చింది. సామాన్యులకు ఇచ్చిన హామీని రతన్ టాటా నెరవేర్చుకున్నారు. కానీ ఆయన ఆశించిన విజయాన్ని మాత్రం నానో కారు అందుకోలేకపోయింది. నీరా రాడియా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. టాటా మోటార్స్ హ్యచ్ బ్యాక్ ఇండియా లాంచ్, కోరస్ కొనుగోలు, ఫోర్డ్, టాటా నానోకు సంబంధించిన విషయాలను, జాగ్వార్ లాండ్ రోవర్ కొనుగోలు గురించి వివరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us