Toll Charges: పదే పదే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. 20 కిలోమీటర్లలోపు.. కేంద్రం బిగ్ రిలీఫ్..

టోల్ చెల్లింపుల్లో మరో కొత్త విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. వాహనదారులకు ఈ నిర్ణయంతో మరింత ఊరట కలగనుంది. పదే పదే టోల్ గేట్ల దగ్గర ఆగి టోల్ చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. సులభంగా టోల్ ప్లాజాలను దాటేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.

Toll Charges: పదే పదే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. 20 కిలోమీటర్లలోపు.. కేంద్రం బిగ్ రిలీఫ్..
Toll Gate

Updated on: Jun 17, 2026 | 2:10 PM

దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలు, పదేపదే టోల్ చెల్లించాల్సిన ఇబ్బంది తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా త్వరలో టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, టోల్ గేట్లకు సమీపంలో నివసించే వాహనదారులకు ఊరట కలిగించనుంది. ఈ మేరకు టోల్ ప్లాజాల సమీపంలో నివసించే వాహదారుల కోసం డిజిటల్ ఇ-పాస్ సేవలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ పాస్‌ల వల్ల పదేపదే టోల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టోల్ వసూలును వేగవంతంగా, పారదర్శకంగా, డిజిటల్‌గా మార్చడంలో భాగంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

20 కిలోమీటర్ల పరిధిలో..

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సమీప ప్రాంతాల వాహనాలు ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వారి ప్రయాణం వేగంగా పూర్తవుతుంది. అంతేకాకుండా టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు ఇతర వాహనదారులు కూడా త్వరగా గేట్ దాటేలా సహకరిస్తుంది. టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు డిజిటల్ పాస్‌లను జారీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ పాస్ నేరుగా ఫాస్టాగ్‌కు లింక్ అయి ఉంటుంది. దీనివల్ల స్థానిక వాహనదారులు ఎటువంటి అంతరాయం లేకుండా టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఈ సౌకర్యం ఉపయోగించుకునేందుకు నెలవారీ, వార్షిక పాస్‌లు రెండూ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాస్‌ల ధర కూడా చాలా తక్కువగా ఉండేలా నిర్ణయించనున్నారు. ఇది ప్రతిరోజూ టోల్ ప్లాజాను దాటే సమీప పరిధిలోని వాహనదారులకు ఉపయోగపడనుంది.

ప్రత్యేక పాస్ జారీ

స్థానికులు అనేది డిజిటల్‌గా నిర్థారిస్తారు. అనంతరం ఒక ప్రత్యేక పాస్ జారీ చేస్తారు. ఇది నిర్దేశిత సెక్టార్లలోని టోల్ ప్లాజాల గుండా సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల టోల్ నిబంధనల పాటింపు మెరుగుపడటంతో పాటు అనధికారిక రాయితీలు అరికట్టబడతాయి. అలాగే టోల్ వసూలు వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ భావిస్తోంది. అనేక కొత్త టోల్ ప్లాజాల వద్ద ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలు డిజిటల్ పాస్ విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళిక వేస్తున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నాయని తెలుస్తోంది. ఈ విధానం వల్ల ప్రయాణికుల సమయం భారీగా ఆదా అవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అనేక సంస్కరణలను కేంద్రం టోల్ గేట్ల వద్ద ప్రవేశపెట్టిది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేసింది.

Follow Us