
జియో, ఎయిర్టెల్కు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో కస్లమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే అత్యంత చౌక అయిన ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్తో ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వనుంది. ఇకపై, మీరు మీ దగ్గరలోని పోస్టాఫీసులో BSNL సిమ్ కార్డులు, మొబైల్ రీఛార్జ్లు కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ – ఇండియా పోస్ట్ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా దాదాపు 1.65 లక్షలకు పైగా పోస్టాఫీసులు బీఎస్ఎన్ఎల్ సేల్స్ పాయింట్లుగా మారనున్నాయి. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు టెలికాం సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం దీనిని డిజిటల్ ఇండియా, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది.
BSNL సిమ్ కార్డ్ స్టాక్ను పోస్టాఫీసులకు అందిస్తుంది. అంతేకాకుండా పోస్టల్ ఉద్యోగులకు కొత్త కనెక్షన్లు, రీఛార్జ్లు అందించడంలో శిక్షణ ఇస్తుంది. పోస్టల్ శాఖ వినియోగదారులకు సురక్షితమైన, ప్రామాణిక పద్ధతిలో సేవలను అందిస్తుంది. దీనివల్ల ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి బీఎస్ఎన్ఎల్ సేవలను పొందవచ్చు.
ఈ ఒప్పందానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ అస్సాంలో విజయవంతం అయ్యింది. అందుకే ఇప్పుడు దీనిని దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సరం పాటు ఉంటుంది, అవసరమైతే దానిని పొడిగించవచ్చు.
పోస్టల్ విభాగానికి చెందిన బన్సాల్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ఇండియా పోస్ట్ యొక్క విస్తృత నెట్వర్క్, బీఎస్ఎన్ఎల్ టెలికాం నైపుణ్యాన్ని కలిపి ప్రతి పౌరుడికి సరసమైన, అందుబాటులో ఉండే కనెక్టివిటీని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సహకారం దేశంలోని ప్రతి మూలకు BSNL సేవలను తీసుకువస్తుందని గార్గ్ ఆకాంక్షించారు.
ఈ ఒప్పందం సెప్టెంబర్ 17 నుండి ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. అవసరమైతే దీనిని పొడిగించవచ్చు. రెండు విభాగాలు ఈ ఒప్పందాన్ని నెలవారీగా సమీక్షిస్తాయి. సైబర్ భద్రత, డేటా గోప్యత నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాయి. ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకు, ముఖ్యంగా గ్రామీణ దేశానికి, గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..