
గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల కోసం అగ్రి గోల్డ్ లోన్ను ఈ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. వ్యవసాయ, దాని అనుబంధ పనుల కోసం బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రైతులు రుణం తీసుకోవచ్చు. అత్యంత సులభంగా లోన్ మంజూరు కావడమే కాకుండా వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్ పొందే అవకాశముంది. 18 క్యారెట్ల బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా ఈ రుణం తీసుకోవచ్చు. మీరు తాకట్టు పెట్టే బంగారం విలువలో 80 శాతం వరకు రుణం పొందవచ్చు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల పనుల కోసమే ఈ రుణం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఇక బంగారు నాణెలపై కూడా గరిష్టంగా 50 గ్రాముల వరకు లోన్ తీసుకోవచ్చు. భారతీయ పౌరులై బంగారు ఆభరణాలకు యాజమానులై ఉంటే అగ్రి గోల్డ్ లోన్ పొందవచ్చు. 12 నెలల్లోపు రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక గడువుకు ముందే లోన్ తిరిగి చెల్లిస్తే ఎలాంటి జరిమానాలు విధించరు. ముందుగా చెల్లిస్తే ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. రూ.3 లక్షల్లోపు రుణం తీసుకున్నవారు ముందుగా చెల్లిస్తే ఎలాంటి జరిమానాలు ఉండవు. రైతులకు పంట చేతికి వచ్చినప్పుడు చెల్లించేలా ఇందులో సదుపాయం కల్పించారు. అసలు లేదా వడ్డీ ఏదైనా చెల్లించవచ్చు. రైతుల కోసం ప్రత్యేకంగా అగ్రి గోల్డ్ లోన్ ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది.
ఇక ఏదైనా రుణం తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. లోన్ డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ కోసం వీటిని వసూలు చేస్తారు. అయితే అగ్రి గోల్డ్ లోన్ తీసుకునే రైతులకు బ్యాంక్ ఆఫ్ బరోడా తీపికబురు అందించింది. రూ.3 లక్షల్లోపు లోన్ తీసుకున్నవారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని స్పష్టం చేసింది. ఆ పైన లోన్ తీసుకునేవారికి మాత్రమే ప్రాసెసింగ్ ఫీజులతో పాటు జీఎస్టీ ఉంటుంది. రూ.3 లక్షల్లోపు లోన్ తీసుకునేవారికి ఒకే ఏడాది ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు విధిస్తారు. వ్యవసాయ పనుల కోసం రుణం కావాలనుకునేవారికి ఇది మంచి న్యూస్గా చెప్పవచ్చు.