
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ 2025 ప్రసంగంలో గిగ్ వర్కర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందజేస్తుందని ప్రకటించారు. ముఖ్యంగా కోటి మంది గిగ్ కార్మికులకు ఈ-శ్రమ్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులను పొందాలని స్పష్టం చేశారు. వీరికి ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించారు. 2020 సామాజిక భద్రత నియమావళి ప్రకారం గిగ్ వర్కర్ అంటే సాంప్రదాయ యజమాని-ఉద్యోగి సంబంధానికి వెలుపల పనిచేసే లేదా పరిహారం పొందే ఏ వ్యక్తి అయినా గిగ్ వర్కర్ కింద పేర్కొంటున్నారు. వీరు సాధారణంగా ఫ్రీలాన్స్ లేబర్, రైడ్-హెయిలింగ్ లేదా ఫుడ్ డెలివరీ వంటి ఆన్-డిమాండ్ వృత్తుల్లో పనిచేస్తారు.
పీఎం-జేఏవైతో సెకండరీ, టెర్షియరీ ఆసుపత్రిలో ఓ కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్య సేవలు పొందడానికి బీమా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ముందుగా ఉన్న వ్యాధులకు సైతం మొదటి రోజు నుండే బీమా కవర్ అవుతుంది. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద రిజిస్టర్డ్ ఈ-శ్రమ్ సభ్యులు బీమా కవరేజీని ఉపయోగించుకోవడానికి అర్హత ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక రక్షణ కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ-శ్రమ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయడానికి ఆధార్ నంబర్, ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరం అవుతుంది. ఆధార్-లింక్డ్ మొబైల్ ఫోన్ నంబర్ లేకపోతే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా రాష్ట్ర సేవా కేంద్రంలో బయోమెట్రిక్ ప్రామాణీకరణను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు.