
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి నుంచి 3 నెలల వరకు ఓనర్స్ ఇంటి అద్దెలు వసూలు చేయకూడదని తెలంగాణ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడగకూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలల తర్వాత బకాయిలను వాయిదా పద్దతిలో తీసుకోవాలని హౌజ్ ఓనర్స్ ను ఆదేశించింది. అద్దెలు కట్టమని, ఇళ్లు ఖాళీ చేయమని వేధించొద్దని సూచించింది. సర్కార్ ఆదేశాలు బేఖాతరు చేస్తే.. అంటువ్యాధుల నిరోధక చట్టం- 1897, విపత్తు నిర్వహణ చట్టం- 2005 కింద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.