
Police attack on journalists in Krishna district: కృష్ణా జిల్లా పోలీసులు కరోనా లాక్ డౌన్ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై ప్రతాపం చూపారు. రోడ్డు మీదికి వస్తారా అంటూ లాఠీలతో చితకబాదారు. మేం జర్నలిస్టులం బాబూ… న్యూస్ కవర్ చేస్తున్నాం అంటున్నా వినకుండా కాళ్ళపై లాఠీలతో వాతలొచ్చేలా చితకబాదారు. పైగా విలేకరులైతే మాకేంటని దుర్భాషలాడారు.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలిలో లాక్ డౌన్ న్యూస్ కవర్ చేస్తున్న విలేకరులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఉన్నప్పటికీ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. పోలీసుల దాడిలో పలువురు విలేకరులు, వీడియో జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల దురుసు వైఖరికి నిరసనగా జర్నలిస్టుల బృందం రోడ్డుపై బైఠాయించారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కింద స్థాయి పోలీసుల అత్యుత్సాహం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. సదరు పోలీసులపై చర్యలకు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.