
నేరం ఇక్కడ జరిగింది కాబట్టే చర్యలు ఇక్కడ తీసుకుంటున్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసును ఏపీ పోలీసులకు అప్పగించాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన డేటా చోరీ చేశారంటూ ఇక్కడ ఫిర్యాదు చేశారని అందుకే ఇక్కడి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల వివరాలను ఐటీ గ్రిడ్ అనే సంస్థకు ఎలా ఇస్తారని, తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా బుకాయించడం చంద్రబాబుకు అలవాటు అని కేటీఆర్ అన్నారు. అసలు ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి? అని ఆయన నిలదీశారు.
ఇక కాంగ్రెస్ శాసనసభ్యులను ఎంతకు కొన్నారో సీఎం చెప్పాలి అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు గిరిజన సంక్షేమం కోసం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారని.. అవసరమైతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఉత్తమ్ వీటిని పట్టించుకోకుండా టీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాహుల్, ప్రియాంక సమక్షంలో యూపీలో బీజేపీకి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ చేరారని, దానిపై మీరు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎంతకు కొన్నారని, అంతకుముందు టీడీపీకి చెందిన రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పుడు వారికి ఎంత ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాజకీయాలను చులకన చేయొద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలనూ గెలుచుకునే సత్తా టీఆర్ఎస్కు ఉన్నప్పుడు కొనాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.