కేరళ..గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. యుఏఈ రోల్ పై ‘నిఘా’
కేరళలో 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కోచ్చిలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ పైనా..
కేరళలో 30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కోచ్చిలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ పైనా ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. సందీప్ నాయర్ ఈ కార్యాలయంలో ఒకప్పుడు పని చేసిన ఉద్యోగి కాగా.. ఆయన ఓ ఆటో మొబైల్ వర్క్ షాపు యజమాని కూడా. స్వప్నతో బాటు ఇతడ్ని కూడా కోచ్చి కోర్టులో హాజరు పరచనున్నారు. వీరిని రెండు వారాల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈ సంస్థ కోర్టును కోరనుంది. బంగారం దొంగ రవాణా వ్యవహారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దౌత్య కార్యాలయంలో పని చేసిన మాజీ ఉద్యోగులు లేదా ప్రస్తుత ఉద్యోగుల హస్తం ఉందా అన్న విషయంపైనా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది. వారి మద్దతు లేనిదే ప్రధాన నిందితులు ఈ భారీ స్మగ్లింగ్ కి పాల్పడడం అసాధ్యమని వీరు భావిస్తున్నారు. కాగా సరిత్ అనే మాజీ ఉద్యోగిని ఈ నెల 5 న కస్టమ్స్ శాఖ అరెస్టు చేసింది.