AP CM Jagan warned traders for excess pricing: ఏపీలో అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయిస్తే ఏకంగా జైలుకే పంపుతానని హెచ్చరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్కరు పస్తులుండకూడదంటూనే నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తూ జనం భయాన్ని సొమ్ము చేసుకోవద్దని, అలాంటి వారెవరైనా కనిపిస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వార్నింగిచ్చారు.
కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక ధరలకు నిత్యావసర సరుకులు అమ్మితే అరెస్టు చేసి, జైలుకు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ షాపులకు ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. ప్రతి జిల్లాలో 5000 పడకలతో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై రెండు స్థాయిల్లో సర్వెలెన్స్ పెట్టాలని, కార్పొరేషన్ పరిధిలో ప్రతి వార్డుకు ఒక వైద్యుని పర్యవేక్షణ వుండాలని జగన్ నిర్దేశించారు. మున్సిపాలిటీలలో ప్రతి మూడు వార్డులకు ఒక వైద్యునితో పర్యవేక్షణ జరపాలన్నారు. పటిష్ట చర్యలతో కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకుంటూనే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
రైతుల పంటలు చేతికొచ్చే తరుణం ఆసన్నమైన తరుణంలో వారికి ధైర్యం చెప్పాలని, ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. అదే సమయంలో సాగునీరు అవసరమైన చివరి దశలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.