శ్రీనగర్ : కుప్వారా జిల్లాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో.. భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆ ఇంటి సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఓ భవనంలో నుంచి ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ కాల్పుల్లో మధ్యలో కాల్పులకు విరామం కూడా ఇచ్చారు. అయితే ఈ విరామంలోనే బలగాలు ఆ ఇంటివైపు మరికాస్త ముందుకు వెళ్లసాగాయి. చివరకి ఉగ్రవాదుల నుంచి కాల్పులు ఆగిపోయాయి. బలగాలు కాస్త దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ రెండు మృతదేహాలు కనిపించాయి.
ఉగ్రవాదులు చనిపోయారని భద్రతా బలగాలు భావించి.. ఆ మృతదేహాల సమీపానికి వెళ్లాయి. అంతలోనే.. కింద పడి ఉన్న మరో ఉగ్రవాది ఒక్కసారిగా పైకి లేచాడు. బలగాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ అధికారి సహా ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కుప్వారా జిల్లా బాబాగుండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ కాల్పుల్లో ఓ పౌరుడు కూడా మరణించాడు. మరో తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అదే సమయంలో, భద్రతా బలగాలకు, స్థానిక యువకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వసీమ్ అహ్మద్ మిర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.