పార్లమెంటు సెషన్‌కు కరోనా బ్రేక్!

|

Sep 19, 2020 | 1:42 PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి బ్రేక్ వేసే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 1వ తేదీ వరకు కాకుండా అర్ధంతరంగా ముగించే పరిస్థితి...

పార్లమెంటు సెషన్‌కు కరోనా బ్రేక్!
Follow us on

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి బ్రేక్ వేసే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 1వ తేదీ వరకు కాకుండా అర్ధంతరంగా ముగించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పార్లమెంటు సెషన్ కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగాన్ని పుంజుకుంది. ఇందులో భాగంగా పలువురు పార్లమెంటు సభ్యులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు కరోనా కాటుతో మృత్యువు పాలయ్యారు. దాంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సెషన్‌ను కుదించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత మార్చి నెలలో మొదలైన కరోనా వ్యాప్తి ప్రస్తుతం దేశంలో శరవేగాన్ని పుంజుకుంది. ప్రతి రోజు 90 వేలకు పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. గురు, శుక్రవారాల్లో వరుసగా 95 వేలు, 96 వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడుతున్న పార్లమెంటు సభ్యుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 30 మంది ఎంపీలకు, పలువురు కేంద్ర మంత్రులకు కరోనా వైరస్ సోకింది. పదుల సంఖ్యలో పార్లమెంటు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు ముగ్గురు ఎంపీలు కరోనా సోకి మరణించారు.

ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం పలు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించే పనిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది చేపట్టినట్లు సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీన మొదలైన వర్షాకాల సమావేశాలు.. అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగాల్సి వుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ 1 కంటే ముందుగానే సెషన్‌ను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.