Indian students: భారతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి నిషేధాన్ని పొడిగించిన చైనా
ఉన్నత విద్యను అభ్యసించేందుకు చైనా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. భారతీయ విద్యార్థులకు మరోసారి నిరాశే మిగిలింది.

China on overseas students: ఉన్నత విద్యను అభ్యసించేందుకు చైనా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. భారతీయ విద్యార్థులకు మరోసారి నిరాశే మిగిలింది. చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయులపై ఉన్న ఆంక్షలను మరోసారి కొనసాగించింది. కరోనా నేపథ్యంలో స్వదేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.. చైనాలోకి అడుగుపెట్టేందుకు ఆ దేశం నిరాకరించింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఆ దేశంలోకి భారతీయ విద్యార్థుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని మరోసారి పొడగిస్తున్నట్టు పేర్కొంది.
భారతీయ విద్యార్థులు మరికొంత కాలం ఆన్లైన్లోనే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ముఖ్య సమాచారం కోసం యూనివర్సిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సూచనలు పాటించాని సూచించింది. భారతీయ విద్యార్థుల సమస్యలను చైనాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
కాగా.. 2018కి సంబంధించిన సమాచారం ప్రకారం చైనా యూనివర్సిటీల్లో దాదాపు 4.92లక్షల మంది విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో దాదాపు 23వేల మంది భారత్కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. 2019 డిసెంబర్లో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. కాగా.. చైనాలోని చాలా విశ్వవిద్యాయాలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాయి. అయితే, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపుతున్న చైనా.. భారతీయ విద్యార్థులపై మాత్రం ఆంక్షలు విధిస్తోంది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాకుండా అడ్డుకుంటోంది. మరింత కాలం సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆన్లైనా క్లాసుల ద్వారా హాజరు కావాలని సూచిస్తోంది.