ఓ ప్రభుత్వ ఉద్యోగిని మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. అవరమైన చోటికి బదిలీ చేయిస్తానంటూ నమ్మబలికాడు. అందినకాడికి దండుకుని ఆపై కామవాంఛను తీర్చుకున్నాడు. గట్టిగా నిలదీసేసరికి తప్సించుకు తిరుగుతున్న మోసగాడిని ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.ఆదిలాబాద్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ భర్త హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు, భర్తతో పాటు హైదరాబాద్లోనే ఉండాలని ఆమె బదిలీ కోసం ఉన్నతాధికారులకు అర్జి పెట్టుకుంది. ఇదే క్రమంలో బంధువుల ద్వారా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాలిపెల్లి చంద్రశేఖర్ 2017లో పరిచయమయ్యాడు.
అయితే, తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసునని, హైదరాబాద్కు బదిలీ చేయిస్తానని ఆమెను నమ్మబలికాడు. ఇందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పడంతో అతనికి డబ్బులు కూడా ముట్టజెప్పింంది. అనంతరం బాధితురాలిపై కన్నుపడ్డ కామాంధుడు, ఆమెను నమ్మించి హైదరాబాద్కు తీసుకెళ్లి తన ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారం కాజేశాడు. అంతేకాకుండా, బదిలీ కావాలంటే ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తుండటం మొదలు పెట్టాడు. దీంతో తట్టుకోలేక ఆమె ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన ఆదిలాబాద్ పోలీసులు నిందితుడిని ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకొన్నారు.. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, అమాయకపు మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న దుర్మర్గలపట్ల కఠినంగా వ్యవహరించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.