AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. బడ్జెట్ సమావేశాలు, ఉక్కు ప్రైవేటీకరణపైనే ప్రధాన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి అధ్యక్షతనఉదయం 11 గంటలకు ఈ మేరకు కేబినెట్ భేటీ జరగనుంది.

మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. బడ్జెట్ సమావేశాలు, ఉక్కు ప్రైవేటీకరణపైనే ప్రధాన చర్చ
Balaraju Goud
|

Updated on: Feb 23, 2021 | 9:20 AM

Share

AP cabinet meet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి అధ్యక్షతనఉదయం 11 గంటలకు ఈ మేరకు కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్‌లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా.. వివిధ కీలకాంశాలు చర్చించనున్నారు మంత్రులు. దాదాపు 23 అంశాలతో కూడిన అజెండా సిద్ధం చేశారు. ఇక, మార్చిలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా కేబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడి, ఖర్చులు, అప్పులపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది.

అలాగే, కరోనా సంక్షోభంతో కుదేలైన రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంపైనా కేబినెట్ భేటీలో చర్చిచనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా కేబినెట్‌ మీట్‌లోనే ఖరారు అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలు ఉండడంతో.. దీనిపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన సీఎం.. కేబినెట్‌ భేటీలోనూ దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన జగన్‌ మంత్రివర్గంలో తీర్మానం ద్వారా కేంద్రాన్ని మరోసారి కోరే అవకాశం ఉంది.

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి పీఆర్సీ విషయమై అభిప్రాయాలు స్వీకరించారు. ఇందులో భాగంగా 30 శాతానికి అటు ఇటుగా పీఆర్సీ ప్రకటించే సూచనలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దీనిపై కేబినెట్‌ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 4వ తేదీన తిరుపతి వేదికగా సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ప్రభుత్వం అజెండా సిద్ధం చేసుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు.. ప్రత్యేక హోదా, విభజన హామీల పరిష్కారానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ప్రస్తావించాలని ప్రభుత్వం​ భావిస్తోంది.

మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు.. సంక్షేమ పథకాలతోపాటూ కీలక అంశాలపై చర్చించనున్నారు.

Read Also…  అంతర్వేదిలో ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం