Bharat Bandh: భారత్ బంద్ మధ్యాహ్నం 3 గంటల వరకు, వాటికి మాత్రమే మినహాయింపు
మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు.

Bharat Bandh: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళన తీవ్రతరమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లోని రైతులంతా దేశరాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం భారత్ బంద్కు పిలుపునిచ్చారు. తాము చేపట్టే ఈ శాంతియుత బంద్కు దేశంలోని ప్రజలంతా సహకరించాలని కోరారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు. తాము చేపట్టే నిరసన సామాన్యులకు ఇబ్బంది కలిగించడానికి కాదని బీకేయూ నేతలు చెప్పారు. ఆఫీస్లకు, పనులకు వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా తాము ఉదయం 11 గంటలకు బంద్ మొదలుపెడతామన్నారు. ఇక అత్యవసర సేవలకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అంబులెన్స్లకు అనుమతి ఉండేలా చూస్తామన్నారు. అలాగే వివాహాలు కూడా చేసుకోవచ్చని తెలిపారు. అయితే బంద్ కు మద్దతుగా అన్ని మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో సరుకుల రవాణాకు ఇబ్బంది ఏర్పడనుంది. ఇక ఎన్డీయేతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా బంద్కు మద్దతు తెలిపాయి.
బంద్ ఎలాంటి హింసకూ దారి తియ్యకుండా ప్రశాంతంగా జరిగేలా చెయ్యాలనుకుంటున్నారు రైతు సంఘాల నేతలు. ఢిల్లీలో రాస్తా రోకోలు, కార్పొరేట్ సంస్థల దిష్టి బొమ్మల దగ్దం, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. బంద్కు విపక్షాలు మద్దతు ప్రకటించడంతో దేశంలో అల్లర్లు జరుగుతాయోమోననే ఆందోళన మొదలైంది. దీంతో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని చెప్పింది. జనం గుమికూడకుండా చూడాలని పేర్కొంది. కోవిడ్ నిబంధలను పక్కాగా అమలు చేయాలని సూచించింది. శాంతియుత పరిస్ధితులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాలని తెలిపింది. కాగా బంద్లో తాము పూర్తిస్ధాయిలో పాల్గొని వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని విపక్ష పార్టీలన్నీ స్పష్టం చేశాయి. కాంగ్రెస్తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. అలాగే భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బంద్కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రైతు సంఘాల డిమాండ్లకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు తెలిపింది. ఇక ఢిల్లీ వచ్చిన రైతులు తాము ఎన్నాళ్లైనా అక్కడే ఉంటామనీ బిల్లులను వెనక్కి తీసుకునేవరకూ తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అక్కడే ఉంటూ వంటలు చేసుకునేలా రైతులు అన్ని వస్తువులనూ తమతో తెచ్చుకున్నారు. దాదాపు ఆరు నెలలకు సరిపడా ధాన్యం కూడా తెచ్చుకున్నారు. ఈ సమస్యకు కేంద్రప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపిస్తేనే మేలు.. లేదంటే ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది.