
ఆమె పేరు వెన్నెల.. కానీ సమాజం కోసం ఏదో చేయాలని ఆలోచన.. మహిళా సాధికారత కోసం అవగాహన పెంచాలని సంకల్పించింది. అంతేకాదు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాల కోల్పోతున్న వారిని చూసి చలించి హెల్మెట్లపై అవెర్నెస్ క్యాంపెయిన్ చేసేలా నిర్ణయం తీసుకుంది. అంతే.. రెండు తెలుగు రాష్ట్రాలు చుట్టేయాలని అనుకుని బయలుదేరింది. మోటార్ బైక్.. కారు కాదు.. ఏకంగా సైకిల్పై ప్రయాణం మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి అరకులోయకు చేరుకుని అందరి ప్రశంసలు అందుకుంది.
44 రోజులు.. 1,300 కిలోమీటర్లు.. హైదరాబాద్ నుంచి ఏపీలోని అరకు లోయకు సైకిల్ యాత్ర చేపట్టి.. దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసింది వెన్నెల. గత నెల 14న హైదరాబాద్ నుంచి సైకిల్పై వెన్నెల బయలుదేరారు. తిరుపతి సహా మరికొన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ముందుకు సాగారు. చివరకు అరకు లోయ చేరుకున్నారు. ఆడపిల్ల సాహస యాత్ర చేయడం అది కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడంతో అందరూ సెల్యూట్ చేశారు. అరకు లోయ చేరుకున్న ఆమెకు ఆదివాసీ పరిరక్షణ సమితి సభ్యులు, గిరిజన సంఘాలు పలు రాజకీయ పార్టీల పద్ధతులు ఆమెకు సాధర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెన్నెల తన ప్రయాణ విశేషాలను వారితో పంచుకున్నారు.
‘‘మహిళా సాధికారత, హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాను. ఈ యాత్రలో ఎంతో మంది ప్రోత్సహించారు. ఆప్యాయంగా ఆదరించి వారి ఇళ్లలో ఆతిథ్యం ఇచ్చేవారు. మరికొన్నిసార్లు రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద కాస్త విశ్రాంతి తీసుకునేదాన్ని.. నా పర్యటనలో తిరుపతి, అరకులోయ చాలా బాగా నచ్చాయి’’ అని వెన్నెల తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను ఘనంగా సత్కరించి, అభినందించారు. గతంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడంతో పాటు గత ఏడాది కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది తన కోరిక అని వెన్నెల చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..