ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్గా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేయగా, తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది.
గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరటంతో, మరో నేత దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి మంతనాలు జరిపారు. హనుమాన్ జంక్షన్లోని దుట్టా ఇంటికి వెళ్లిన ఆయన.. పార్టీలోనే కొనసాగేలా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గన్నవరంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయటం ఖాయమైంది. దీంతో ఎన్నికల్లో వంశీకి సహకారం అందించాలని, దుట్టాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గన్నవరంలో పార్టీ పరిస్థితులపై మూడు నెలల క్రితం సీఎం జగన్కు చెప్పిందే.. ఎంపీ బాలశౌరికి చెప్పానన్నారు వైసీపీ నేత దుట్టా రామచంద్రారావు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మూడు నెలల క్రితం సీఎం జగన్ కలిసి, దుట్టా రామచంద్రరావు ఏం చెప్పారు? పార్టీలోనే కొనసాగుతూ వంశీకి సహకరిస్తానని చెప్పారా? లేక తానే వైసీపీ నుంచి బరిలోకి దిగుతానన్నారా? ఇంతకీ.. సీఎం జగన్కు ఆయన ఏం చెప్పి ఉంటారనే ఆసక్తి నెలకొంది. అయితే మొదటి నుంచి గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుకు మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమనే పరిస్థితి ఉంది. అవకాశం చిక్కినప్పుడల్లా ఇద్దరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. గన్నవరంలో వైసీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఈ పరిస్థితిలో ఎంపీ బాలశౌరి రాయబారం ఫలిస్తుందా? దుట్టా చల్లబడినట్లేనా? అటు వంశీ కూడా నియోజకవర్గంలో పరిస్థితులను పూర్తిగా అనుకూలంగా మలచుకొనేందుకు ఒక నివేదికతో త్వరలో సీఎంను కలవనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, గన్నవరం రాజకీయం ఉత్కంఠగా మారుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..