ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. కాసేపటికే దారుణం!
ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఓ మహిళ పప్పు కూర చేసి తన ఇంట్లో వారికి వడ్డించింది. అంతే.. గంటల వ్యవధిలోనే కుటుంబం అంతా తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఆ వంట స్పెషాలిటీ ఏమిటాని ఆశ్చర్యపోతున్నారా? ఆమె వంట చేసింది ఉమ్మెత్త ఆకులతో మరీ..

కాకినాడ, మే 5: ఓ మహిళ ఇన్స్టా రీల్ చూసి చేసిన వంట నలుగురి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉమ్మెత్త ఆకులతో కూర చేసుకుని తింటే బలమని ఇన్స్టాగ్రామ్లో ఎవరో వీడియో చేస్తే.. అది చూసి సదరు మహిళ పప్పు కూరలో ఉమ్మెత్త ఆకులు వేసి వంట చేసింది. అది తిని నలుగురు కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. అక్కడి జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే..
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామానికి చెందిన బిక్కిన వీరబ్బు కుమారుడు హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ రిత్యా అతడి కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటోంది. సొంత ఊళ్లో ముత్యాలమ్మ తీర్థం ఉండటంతో వీరబ్బు కోడలు గంగాభవానీ, ఇద్దరు మనుమళ్లతో కలిసి సొంత ఊరైన యర్రంపాలెం వచ్చారు. కోడలి పుట్టిళ్లు కూడా అదే గ్రామంలో ఉండటంతో.. గంగాభవానీ పుట్టింటికి వెళ్లింది. ఆదివారం జరిగిన ముత్యాలమ్మ తీర్థం కార్యక్రమంలో కుటుంబమంతా పాల్గొన్నారు.
గంగాభవానీ తల్లి వీరలక్ష్మికి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసే అలవాటు ఉంది. దీంతో వీరలక్ష్మికి ఇన్స్టాలో ఉమ్మెత్త ఆకులతో కూర చేసే వీడియో చూసింది. ఈ ఆకులతో వంట చేస్తే బలమని వీడియోలో చెప్పడంతో నమ్మని ఆమె ఉమ్మెత్త ఆకులతో పప్పు కూర వండింది. అదే రోజు మధ్యాహ్నం వీరలక్ష్మీతోపాటు వీరబ్బు, కూతురు గంగాభవానీ, వారి బంధువు జయలక్ష్మీ.. నలుగురు కలిసి ఉమ్మెత్త పప్పుతో భోజనం చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఈ నలుగురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయానికి అందరూ మత్తులోకి జారుకున్నారు. గమనించిన గంగాభవానీ తండ్రి హరిబాబు వెంటనే వారిని పెద్దాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించాలని సూచించారు. అక్కడ చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే వీరలక్ష్మి భర్త హరిబాబు, గంగాభవానీ ఇద్దరు కుమారులు మాత్రం ఉమ్మెత్త ఆకు పప్పు కూర కాకుండా వేరే కూరతో భోజనం చేయడంతో వీరికి ప్రమాదం తప్పింది. లేదంటే కుటుంబమంతా ఆస్పత్రి పాలయ్యేవరని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




