Cyclone Mandous: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

|

Dec 09, 2022 | 12:03 PM

ఏపీకి మండూస్ తుఫాన్ ముప్పు తప్పేలా లేదు. రాయలసీమలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది వాతావరణ శాఖ.

Cyclone Mandous: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
Mandous Cyclone
Follow us on

ఏపీకి మాండూస్ ముప్పు ముంచుకొస్తోంది. వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మాండూస్‌..12 కిలోమీటర్ల వేగంతో పయస్తోంది. శుక్రవారం రాత్రికి తమిళనాడు-మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశముంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తుఫాన్‌ ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్‌. తుఫాన్ నేపధ్యంలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతల సమయం కావడంతో హడావుడిగా కుప్పలు వేసుకుంటున్నారు. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీంతో నిజాంపట్నం హార్బర్‌లోనే నిలిచిపోయాయి బోట్లు.

ఇక తిరుపతి జిల్లాపైనా మాండూస్‌ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముంది. దీంతో జిల్లాలో స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్‌. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లా కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఒంగోలు చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్ దినేష్ కుమార్.

తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ వెల్లడించింది. ప్రకాశం, కడప జిల్లాలో కూడా భారీ వర్షాలతో పాటు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇవాళ 50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక శనివారం 85 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు ఎవ్వరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాన్‌పై స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికల పర్యవేక్షణ చేస్తున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3,తిరుపతి-2,చిత్తూరు-2.. మొత్తం 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపినట్లు వెల్లడించింది. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..