
పక్కింట్లో సాయం చేయడానికి వెళ్లిన మహిళ.. ఊహించని విధంగా అగ్ని ప్రమాదానికి గురై సజీవ దహనం అయింది. అందరినీ కలిచి వేస్తున్న ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం. విజయనగరం నగరం పట్టణం హుకుంపేట జంక్షన్లోని పేద కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. తన పక్కింట్లో ఉన్న వృద్ధురాలికి సహాయం చేసేందుకు వెళ్లిన 31 ఏళ్ల భవానీ.. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ బిగించే సమయంలో అగ్ని ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. పక్కింటిలో ఉన్న వృద్ధురాలు స్టౌవ్ వెలిగించలేక ఇబ్బంది పడుతుంటే విషయం తెలుసుకున్న భవానీ ఆమెకు సహాయం చేసేందుకు అక్కడకు వెళ్లింది. గ్యాస్ సిలిండర్ కు రెగ్యులేటర్ అమరుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి.. క్షణాల్లోనే మంటలు గది అంతా దావనంలా వ్యాపించి భవానీని చుట్టుముట్టాయి. దీంతో భవానీకి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకవుతున్న పరిస్థితి గమనించిన ఇంటి యజమాని అయిన వృద్ధురాలు మాత్రం చాకచక్యంగా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. ఆ సమయంలో భవానీని పలువురు కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో భవానీ అందరూ చూస్తుండగానే ఆర్తనాదాలు చేస్తూ సజీవ దహనం అయ్యింది. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఆందోళన చెంది కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవానీ భర్త ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారు డ్రైవర్గా పని చేసే ప్రభు, భవానీ దంపతులకు శ్యామ్, సంజయ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒకరు ఆరో తరగతి, మరొకరు ఐదవ తరగతి చదువుతున్నారు. ఏడాదిన్నర క్రితం వరదలతో ఇబ్బంది పడి విజయవాడ నుంచి విజయనగరానికి వచ్చి జీవనం గడుపుతున్నారు. జీవనోపాధి కోసం భవానీ ఘోషాసుపత్రి ప్రాంగణంలో కర్రీ పాయింట్ నడుపుతోంది. అయితే అకాలంగా జరిగిన ఈ దుర్ఘటనతో ఆ కుటుంబం కష్టాల్లో కూరుకుంది. భవానీ మృతితో చిన్నారుల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన అందరిలో కలచివేస్తోంది. సహాయం కోసం వెళ్లి కళ్ల ముందే ఆర్తనాదాలతో భవానీ ప్రాణాలు విడవడం స్థానికులు తట్టుకోలేక పోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..