
అందరితో సరదాగా గడిపే స్కూల్ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విషాదంగా మారింది. బొబ్బిలి కుమ్మరివీధికి చెందిన సుంకరి మాధవీదేవి (40) గత 16 ఏళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. అనంతరం పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. భర్త నరేష్ బాడంగి మండలం చిన్న భీమవరానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం కారు డ్రైవర్గా పనిచేస్తుండగా, మాధవీదేవి ఓ ప్రైవేటు పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తోంది. వారికి పదో తరగతి చదువుతున్న కుమారుడు, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కుటుంబంతో సరదాగా, సంతోషంగా గడిపేవారు. ఈ క్రమంలోనే ఆమెకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, స్టాఫ్ నుంచి తరచూ ఫోన్లు వస్తుండేవి. అలా కాల్స్ రావడం భర్త నరేష్ కి నచ్చేది కాదు. ఆ కాల్స్ వచ్చినప్పుడు ఆమెపై అనుమానపడటం ప్రారంభించాడు. తరువాత రోజుల్లో మద్యం తాగి మాధవీ దేవిపై గొడవ పడటం, వాగ్వాదానికి దిగడం చేసేవాడు. ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు సర్వసాధారణంగా మారింది.
ఈ క్రమంలోనే మాధవీదేవి తన పిల్లలతో కలిసి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలో భర్త ఫోన్ చేయడంతో సుమారు రాత్రి 9.30కి తన ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కూడా తన పుట్టింటిలో ఉన్న తల్లితో మాట్లాడి రేపు ఉదయం రాజాంలో పండుగకు వెళ్దాం, ఉదయాన్నే రెడీగా ఉండాలని చెప్పింది. అనంతరం స్కూల్ కి సంబంధించిన ఒక మెసేజ్ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టింది. అలా పెట్టిన స్కూల్ వాట్సప్ స్టేటస్ చూసిన కొందరు స్కూల్ సిబ్బంది ఆమెతో మాట్లాడారు. ఆ సమయంలో కొందరు సిబ్బందితో స్కూల్ జీతాల కోసం చాటింగ్ కూడా చేసింది. అంతవరకు అందరికీ బాగానే ఉంది.
ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మాధవీదేవి మరుసటి రోజు ఉదయం ఇంట్లో శవమై కనిపించింది. ఆమె తమ్ముడు కిశోర్కు భర్త నరేష్ ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని ఉదయాన్నే చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మాధవీదేవి భర్త నరేష్ వేధింపుల వల్లే చనిపోయిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే స్కూల్ మెసేజ్ వాట్సాప్ స్టేటస్ పెట్టిన తరువాత ఆమెతో మాట్లాడిన టీచర్స్ ఎవరు? నిత్యం అనుమానపడుతున్న వ్యక్తి ఎవరైనా ఆ సమయంలో మాధవిదేవికి కాల్ చేశారా? లేక ఆ సమయంలో ఫోన్ రావడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందా? ఆ గొడవ ఆత్మహత్యకు దారి తీసిందా? లేక ఆగ్రహంతో మాధవిని కొట్టి చంపాడా? అనే అనేక అనుమానాలు అందరినీ తొలిచి వేస్తున్నాయి. ఇదే అంశాల పై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది సేపటి ముందు వరకు సరదాగా ఉన్న మాధవీదేవి చనిపోయిందన్న వార్త అందరినీ కలిచివేసింది. ఓ ఉపాధ్యాయురాలు ఇలా దుర్మరణం చెందటం స్థానికులను తీవ్ర దిగ్బంధానికి గురిచేసింది. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..