బీజీకొత్తూరులో మిడతల దండు..రైతుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు, రైతులు మిడతల భయంతో హడలెత్తిపోయారు. జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో..

బీజీకొత్తూరులో మిడతల దండు..రైతుల ఆందోళన

Edited By:

Updated on: Jun 05, 2020 | 12:32 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు, రైతులు మిడతల భయంతో హడలెత్తిపోయారు. జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో బుధవారం జిల్లేడు చెట్లపై మిడతలు కనిపించాయి. మిడతలు పెద్ద సంఖ్యలో జిల్లేడు చెట్లపై చేరి వాటి ఆకులు తిని చెట్లకు ఆకులు లేకుండా మోడుగా మార్చాయి. ఇటీవలి కాలంలో మిడతల వల్ల కలిగే నష్టాలపై అధికారులు అప్రమత్తం చేయడం, పక్క రాష్ట్రాల నుంచి ఏ క్షణంలోనైనా మిడతలు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న తరుణంలోనే మిడతలు కనిపించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మిడతలు చెట్ల ఆకులు తిని మోడుగా మార్చడం గమనించిన వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. మండల వ్యవసాయ అధికారి డి.సాయిశంతన్‌కుమార్‌ బీజీకొత్తూరు గ్రామాన్ని సందర్శించి జిల్లేడు చెట్లపై ఉన్న మిడతలను పరిశీలించారు. ఈ మిడతలు పంటలు నాశనం చేసేవి కావని, జిల్లేడు చెట్ల మీద మాత్రమే పెరుగుతాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి తెలిపారు. దీంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.