
పూజ చేసాక.. పోయిన బంగారం తిరిగి చేతికి వచ్చేసరికి ఆ కుటుంబం కళ్ళలో ఆనందం పట్టలేనిది. పోలీసుల చొరవతో.. ఎట్టకేలకు ఆ బంగారం దొరికింది. గోల్డ్ డ్రైనేజీ కాలువలో కనిపించడంతో.. ఆ కుటుంబానికి అవధులు లేకుండా పోయాయి.. ఈ ఘటన ఎక్కడో కాగు.. విశాఖ శ్రీనగర్ లో జరిగింది. పూజ బంగారం కాలువలోకి ఎలా వెళ్లింది..? ఎలా దొరికింది..? అనేగా డౌట్.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.. గాజువాక శ్రీనగర్ కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు. ఈ నెల 21న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం 3 రోజుల పాటు అమ్మవారి వద్దనే ఆభరణాలు ఉంచారు. ఆ తరువాత రమేష్.. అమ్మవారి పై ఉన్న 3 తులాల హారం, కాసు మాత్రమే తీసుకొని.. పువ్వుల మధ్యలో ఉన్న మిగతా 5 తులాల బంగారు ఆభరణాలు చూసుకోలేదు. 1 బ్రాస్లెట్, 2 గొలుసులు, 3 ఉంగరాలు.. తీయడం మర్చిపోయి పూజకు ఉపయోగించిన పువ్వులు, ఇతర సామాగ్రిని ఎర్రటి వస్త్రంతో సహా చుట్టారు. అయిదు తులాల బంగారు ఆభరణాలతో సహా ఆ పూజా సామాగ్రిని దుర్గా నగర్ వద్ద గల స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జి కింద పారే డ్రైనేజీ కాలువలో పడవేశారు.
ఇంటికి వచ్చిన తర్వాత బంగారం కనిపించకపోవడంతో భార్య దివ్య గమనించి భర్తకు తెలిపింది. దింతో వాళ్లు మళ్ళీ వెంటనే తిరిగి వెళ్లి కాలువలో వెతికినా బంగారం కనిపించలేదు. తీవ్ర ఆందోళనతో స్టీల్ ప్లాంట్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Visakhapatnam Gold Recovery
వెంటనే స్పందించిన సిఐ కేశవరావు.. ఒక కానిస్టేబుల్, హోమ్ గార్డులను ఘటనా స్థలానికి పంపించారు. జేసీబీ సహాయంతో డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించి, నీటి ప్రవాహం తగ్గిన తర్వాత కాలువలో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు. ఈ సమయంలో కొంత దూరంలో చల్లచెదురుగా పడి ఉన్న ఆభరణాలు ఒక్కొక్కటిగా దొరికాయి. దొరికిన ఆభరణాలను సురక్షితంగాతీసుకొచ్చి బాధితులైన దివ్య, రమేష్ దంపతులకు పోలీసులకు అప్పగించారు. పోలీసుల తక్షణమే స్పందించి బంగారం వెతికి పెట్టినందుకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. పండుగలు, పూజల సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సిఐ కేశవరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..