visakha police: రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడుస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త..! ముఖ్యంగా వాళ్లకిది వార్నింగ్‌..

|

Jun 01, 2022 | 8:16 AM

రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడుస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. మీరే ఆ కేటుగాళ్లకు టార్గెట్‌ కావొచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు వాడేవాళ్లూ, ఈ వార్నింగ్‌ మీ కోసమే. ఎందుకంటే..

visakha police: రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడుస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త..! ముఖ్యంగా వాళ్లకిది వార్నింగ్‌..
Phone Snatching
Follow us on

రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడుస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. మీరే ఆ కేటుగాళ్లకు టార్గెట్‌ కావొచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు వాడేవాళ్లూ, ఈ వార్నింగ్‌ మీ కోసమే. ఎందుకంటే..ఇటీవల వాణిజ్య నగరాల్లో సెల్‌ఫోన్ స్నాచర్లు చెలరేగుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ వెళ్లేవారి నుంచి దాన్ని స్వాహా చేసేస్తున్నారు. రోడ్డుపై వెళ్తూ ఫోన్‌ మాట్లాడుతున్న వ్యక్తుల చెవి దగ్గర ఉన్న ఫోన్‌ను లాగేసుకొని క్షణాల్లో తుర్రుమంటున్నారు. తాజాగా ఈ గ్యాంగ్ సాగర నగరంలో హల్‌చల్‌ చేసింది.

విశాఖ నగరంలో విచిత్రమైన నేరాలు పెరిగిపోతున్నాయి. చైన్ స్నాచర్లు, దారి దోపిడీ దొంగల బీభత్సం నుంచి తేరుకోకముందే, ఇప్పుడు మొబైల్ ఫోన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. కొంతకాలంగా విశాఖ నగరంలో మొబైల్ ఫోన్లు స్నాచింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కూడా గాజువాక ప్రాంతంలోనే ఈ సెల్ ఫోన్ స్నాచింగ్‌లు జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. దీనిపై స్పెషల్ ఫోకస్‌ పెట్టి నిందితులను ట్రాక్ చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి కాదు రెండు కాదు ఏకంగా 22 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంగవరం ప్రాంతానికి చెందిన లోవరాజు, శ్రీరాజు, రాము, ముకేంద్ర స్నేహితులు. చిన్నచిన్న కూలి పనులు చేసుకుంటూ వీరంతా స్నేహితులయ్యారు. ఎన్నాళ్లీ కష్టం అనుకున్నారో ఏమో, ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు. బంగారు గొలుసులు ఎత్తుకెళితే కటకటాల పాలవడం ఖాయమని భావించి, ఈ సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ స్టార్ట్‌ చేశారు. సెల్‌ఫోన్ పోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరని ఈ రూట్‌ను ఎంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా రద్దీ లేని గాజువాక ప్రాంతాన్ని ఎంచుకున్న ఈ నలుగురు, టూవీలర్‌పై వెళుతూ అదును కోసం వేచి చూస్తారు. ఎవరైనా రోడ్డుపై సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ, తమను తాము మరిచిపోయినట్టుగా ఉంటారో, వారిని టార్గెట్ చేసి ఫోన్‌ను లాక్కెళ్లిపోతారు. ఇలా లాక్కెళ్లిన సెల్‌ఫోన్లను ఐదారు వేలకు అమ్మేస్తారు. గంగవరం గ్రామం, గంగవరం పోర్ట్ వెళ్లే కూలీలతో పాటు అవసరమైన వారికి తక్కువ ధరకే ఇచ్చేస్తారు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. కానీ, వన్ ఫైన్‌ డే, కథ అడ్డం తిరిగింది. ఫోన్లు పోయాయని అందిన ఫిర్యాదుతో కూపీ లాగిన పోలీసులు, ట్రాక్ చేసి వీరికి చెక్‌పెట్టారు.