MLA Roja: ఎమ్మెల్యే రోజాకు రోజాలతో పూలాభిషేకం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

| Edited By: Janardhan Veluru

Aug 04, 2021 | 4:02 PM

సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఎప్పుడు ఏం చేసినా వార్తల్లో నిలుస్తారు. ఎప్పుడు వార్తల్లో సంచలనంగా ఉండే నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. మరోసారి సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారారు.

MLA Roja: ఎమ్మెల్యే రోజాకు రోజాలతో పూలాభిషేకం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Mla Roja Flower Felicitation
Follow us on

Nagari MLA RK Roja Controversy: సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఎప్పుడు ఏం చేసినా వార్తల్లో నిలుస్తారు. ఎప్పుడు వార్తల్లో సంచలనంగా ఉండే నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. మరోసారి సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారారు. నగరి ఎమ్మెల్యే రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్. నిన్న మొన్నటి వరకూ ఏపీఐఐసీ ఛైర్మన్. సడన్‌గా ఆ పదవి పోవటంతో ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా మిగిలారు. దీంతో..షూటింగ్ సమయం మినహా మిగిలిన సమయం మొత్తం నగరికే కేటాయిస్తున్నారు. అదే విధంగా నియోజకర్గంలో ఇప్పుడు డెవలప్ మెంట్ పైన ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో సోమవారం వడమాలపేట మండలం తట్నేరి దళిత వాడ రోడ్డును రోజా ప్రారంభించారు. ఆసియన్ అభివృద్ధి బ్యాంకు ద్వారా రూ.43 లక్షల నిధులతో పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి రోడ్డును నిర్మించారు. అలాగే, వైఎస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా ఒకొక్కరికి రూ.30 వేల వంతున ఎమ్మెల్యే రోజా పంపిణీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు కోసం వచ్చిన రోజాకు కృతజ్ఞతతో స్థానిక నాయ‌కులు, ప్రజ‌లు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా నెత్తిన రోజా పూలు త‌ట్టల కొద్ది జ‌ల్లి… ఆమెను రోజా పూ రెమ్మల‌తో ముంచెత్తారు. నాయ‌కులు, ప్రజ‌ల అభిమానానికి రోజా ఉబ్బి త‌బ్బిబ‌య్యారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. వాటిలో కొన్ని కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తప్పించారు. పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా, ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతగా పేరున్న రోజాను పదవి నుంచి తప్పించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయితే, త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్న తరుణంలో రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న వార్తలు వెలువడ్డాయి. కాగా, ఛైర్మన్ పదవి పోవడంతో రోజా కూడా గత మూడు నెలల నుంచి నియోజకవర్గంపై, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. కోవిడ్ సమయంలోనూ నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలు. అలాగే అవసరమైనప్పుడల్లా ప్రతిపక్షాలపై మాటల తూటాలు విసిరారు. ఇటీవల జల వివాదం విషయంలో సీఎం జగన్ ను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీంతో దాదాపు రోజాకు మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన అభిమానులు ఆమెను ఘనంగా సత్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమంలో ఏర్పాటు చేసి.. రోజా పూలతో నిలువెత్తున ఎమ్మెల్యే రోజాను సత్కరించుకున్నారు. ఏకంగా పూల వర్షమే కురిపించారు. రోజా పూలతో నింపేశారు.

Mla Roja

గతంలోనూ ఎమ్మెల్యే రోజా ఇదే తరహా వివాదంలో చిక్కుకున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. లాక్‌డౌన్‌ రూల్స్ ఉల్లంఘించి విమర్శల పాలయ్యారు. కరోనా సమయంలో పుత్తూరు సుందరయ్య నగర్‌లో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె దేవతలా పూజలందుకున్నారు. రోజా నడుస్తుంటే.. రోడ్డుకు ఇరువైపులా జనాలు పూల జల్లుతూ స్వాగతం తెలిపారు. సినిమాల్లో మహారాజులకు ప్రజలు స్వాగతం చెబుతున్నట్లుగా ఆ సీన్ కనిపించింది. చిన్న పిల్లలు కూడా పూలు చల్లుతూ కనిపించారు. అలా జనం పూల వర్షం కురిపిస్తుంటే ఆ బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లారు రోజా. ప్రజలు పూలు జల్లుతుంటే.. పూబాటలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు ఎమ్మెల్యే రోజా. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివాదంలో ఈటల రాజేందర్ పాలాభిషేకం..

Etela Rajendar

ఇదిలావుంటే, హుజురాబాద్ ఉపఎన్నిక వేళ మాజీ మంత్రి ఈటల రాజేందర్… నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా దీవెన యాత్ర పేరిట ఆయన అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జులై 29 జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో పర్యటించిన ఈటలకు ఆయన అభిమానులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన పాదాలకు పాలాభిషేకం చేశారు. ఈ అంశం కూడా తెలంగాణలో పెద్ద దుమారం రేపుతోంది. దళితుల చేత కాళ్లు కడిగించుకున్నారని, ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. ఇలా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన నేతలు.. హంగు ఆర్భాటలతో సన్మానాలు, సత్కారాలతో హరతులు పట్టించుకోవడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నేతల తీరుపై నెటిజన్లు విమర్శలతో ఎత్తి పొడుస్తున్నారు.

Read Also..Amara Raja Issue: ‘అమరరాజా’ వ్యవహారం ఏంటి?.. ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?.. ప్రభుత్వం ఏమంటోంది?.. పూర్తి వివరాలివే..