Andhra Pradesh: విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..

విజయవాడలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. పలు ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. రాత్రి 8 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
Stray Dog Menace Grips Vijayawada

Edited By:

Updated on: Oct 22, 2025 | 2:00 PM

విజయవాడలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. న్యూ రాజరాజేశ్వరపేట, భరతమాత కాలనీ, వాంబే కాలనీ, పాయకాపురం, ప్రశాంతినగర్, ఉడాకాలనీ, రాధా నగర్, హెచ్ బ్లాక్ వంటి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన దాడుల వల్ల ఈ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. చిన్నారులను ఒంటరిగా స్కూల్‌కు పంపాలంటే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా కుక్క కాటుకు గురైన సంఘటనలు నమోదయ్యాయి. వాహనాలపై వెళ్తున్నవారు లేదా నడుచుకుంటూ రోడ్లపైకి రావడానికి ప్రజలు భయపడుతున్నారు.

ఉడా కాలానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి ఫర్నిచర్ షాపులో విధులు ముగించుకొని వస్తుండగా కుక్కలు వెంటపడటంతో కంగారుగా వెళ్లి గుంతలో పడిపోయాడు. కుక్క వెంటనే దాడి చేసి అతన్ని గాయపరిచింది. న్యూ రాజరాజేశ్వరిపేట ఆంజనేయ స్వామి గుడి సమీపంలో నివసించే సుబ్బారావు అనే వ్యక్తి డాబా కొట్టు సెంటర్‌లో ఆటో దిగి డబ్బులు ఇస్తుండగా కుక్క వచ్చి అతని పిక్క పట్టుకుని గాయపరిచింది. గాంధీనగర్‌లోని బంగారం షాపులో పనిచేసే మరో వ్యక్తి రాత్రి 10 గంటల తర్వాత నడుచుకుంటూ ఇంటికి రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుక్కలు గుంపులుగా వెంటపడుతుండటంతో ప్రతి రోజు సాహసం చేసి రావాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయాడు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన

కుక్కల బెడద గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నెలలో సుమారు 10 మందికి పైగా కుక్కల దాడులకు గురవుతున్నారని వారు తెలిపారు. కుక్క కాటు దాడుల గురించి వీఎంసీ వెటర్నరీ సర్జన్ సోమశేఖర్ రెడ్డిని వివరణ కోరగా.. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్న పలు ప్రాంతాలను గుర్తించి, వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సురక్షితంగా బయటకు తిరిగేందుకు వీలుగా అధికారులు ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us