
ఏపీలో మరో కొత్త పార్టీకి తెర లేవనుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో టాక్. పొలిటికల్ ఎంట్రీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. చాలాకాలం వైసీపీలో ఉన్న ఆయన, కొన్నాళ్ల కిందట ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. అడపాదడపా వైసీపీ టార్గెట్గా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా Xలో పోస్టులు పెడుతున్నారు. అటు టీడీపీపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆయన వైసీపీని వద్దనుకున్నారు. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే బీజేపీకి కోరస్గా హిందుత్వ సైరన్ మోగిస్తున్నారు. మొదట్లో ఆయన బీజేపీలోకి వెళదామనుకున్నారనే టాక్ వినిపించింది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి ఆయన వెళ్లే అవకాశం తక్కువగా ఉందంటున్నారు.
దీంతో సొంత పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట విజయసాయి రెడ్డి. దీనిలో భాగంగా ప్రాంతాలవారీగా త్వరలోనే సన్నాహాక సమావేశాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీపై శ్రావణమాసంలో అధికారికంగా ప్రకటన చేయడానికి విజయసాయి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో లెక్కల మాస్టారు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. జెండాను, అజెండాను కేర్ఫుల్గా డిజైన్ చేస్తున్నారట. మోదీని ఆదర్శంగా తీసుకుని రాజకీయం చేయనున్నారట విజయసాయి. ఇక జెన్-జీ టార్గెట్గా పాలిటిక్స్ ఉంటాయని సమాచారం. జెన్-జీని ఆకట్టుకునే అజెండా, వ్యూహాలు రూపొందిస్తారట. దానిలో భాగంగా పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్లలో ఎక్కువభాగం వాళ్లకే అని చెబుతున్నారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన విజయ్ను కూడా విజయసాయి స్ఫూర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ తరహాలో డబ్బు లేని రాజకీయంపై ఫోకస్ పెట్టనున్నారట. ఇక హిందుత్వం సెంట్రిక్గా సాగే విజయసాయి రాజకీయంలో…సమానత్వం, కులాలకు అతీతంగా సామాజిక న్యాయం అంశాలను పొందుపరిచారట. యువత, మహిళలు, రైతులను ఆకర్షించేలా పార్టీ విధానాలు ఉంటాయని చెబుతున్నారు. పార్టీకి బూస్టప్ ఇచ్చేందుకు, విజయసాయిరెడ్డి త్వరలో పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
2029 ఎన్నికలే టార్గెట్గా విజయసాయి వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. తన పార్టీకి వెన్నుదన్నుగా ఉండేలా సొంత మీడియాను కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా, మీడియా ప్లాట్ఫామ్ల అండతో తన వాయిస్ని, వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూసుకుంటున్నారట.ఏపీ రాజకీయాలు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టు సాగుతూ ఉంటాయి. అక్కడ మిగిలిన పార్టీలకు పెద్దగా పొలిటికల్ స్పేస్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో….విజయసాయిరెడ్డి పార్టీకి ఎంతవరకు పొలిటికల్ స్పేస్ దొరుకుతుందో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.